Suresh Raina : వచ్చే టీ 20 వరల్డ్ కప్ నాటికి, టీమ్ లో బెస్ట్ ఫినిషర్ పాత్రలో రింకూ సింగ్ ఉండాలి, అలాగే గేమ్ ఛేంజర్ రిషబ్ పంత్ కూడా ఉండాలని మాజీ టీమ్ ఇండియా హిట్టర్ సురేశ్ రైనా తెలిపాడు. ఒకవైపున సునీల్ గవాస్కర్ కూడా రిషబ్ పంత్ పేరే జపిస్తున్నాడు. ఇప్పుడు రైనా కూడా పంత్ ఉండాలని అంటున్నాడు. కారణం ఏమిటంటే రిషబ్ పంత్ స్వదేశీ పిచ్ లకన్నా, విదేశీ పిచ్ లపైనే రాణిస్తున్నాడు. అతని గణాంకాలు అక్కడ బాగుండటమే అందుకు కారణమని అంటున్నారు.
టీ 20 వరల్డ్ కప్ ని అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అయితే ఇండియా ఆడే తొలి గ్రూప్ మ్యాచ్ లన్నీ అమెరికాలోనే జరుగుతున్నాయి. అందువల్ల కొత్త గ్రౌండ్స్, కొత్త పిచ్ లు, అక్కడి వాతావరణం, పరిస్థితులు వీటిని తట్టుకుని ఆడటం ఛాలెంజ్ లాంటిదే. అందుకని రిషబ్ పంత్ ని అందరూ ప్రిఫర్ చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు ఉంటే, కఠినమైన పిచ్ ల మీద వారి అనుభవం పనిచేస్తుందని సురేశ్ రైనా అన్నాడు.
టీ20 క్రికెట్లో విరాట్ దాదాపు 12వేల పరుగులు చేశాడు. కాబట్టి జట్టులో తనొక్కడు ఉంటే, టీమిండియా బ్యాటింగ్ కంచుకోటలా మారుతుందని అన్నాడు. టీ 20 వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు టీమ్ ఇండియాకే ఉంటాయని అన్నాడు. ఒకొక్కసారి ఛేజింగ్ చేసేటప్పుడు కొహ్లీ అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నాడు. ఛేజింగ్ లో కొహ్లీని కొట్టే మొనగాడే లేడని అన్నాడు. ఎటాకింగ్ లో తను కింగ్ అని అన్నాడు.
బెస్ట్ ఫినిషర్గా రింకూ సింగ్ పేరు తెచ్చుకున్నాడని రైనా కొనియాడాడు. తనకు వచ్చిన అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకుని, జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడని తెలిపాడు. అయితే, తను ఉన్నా సరే, టీ 20 ప్రపంచకప్ సమయానికి రిషబ్ పంత్ కూడా జట్టులో ఉండాలి. అతడు మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. అతడో గేమ్ ఛేంజర్” అని రైనా మెచ్చుకున్నాడు.