Khawaja:టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ, వీలైతే క్వాడ్రాపుల్ సెంచరీ(400 పరుగులు) చేయాలని ఏ బ్యాటర్ అయినా కలలు కంటూ ఉంటారు. దాని కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు ఆ ఘనతను అందుకుంటూ ఉంటారు. కానీ ఆ రికార్డుకు చేరువయ్యాక… ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం వల్ల అది దూరమైతే… ఆ బ్యాటర్ పడే బాధ వర్ణనాతీతం. తాజాగా ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు అదే పరిస్థితి ఎదురైంది. 140 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో… ఇలా డబుల్ సెంచరీ ముచ్చట తీరని మూడో బ్యాటర్… ఖవాజా.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో … ఖవాజా 195 పరుగులతో నాటౌట్ గా ఉన్న సమయంలో… ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్… ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. మరో 5 పరుగులు చేస్తే ఖవాజా డబుల్ సెంచరీని అందుకునేవాడు. కానీ… సమయం వృధా అయితే జట్టు విజయావకాశాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో… కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో… డబుల్ సెంచరీకి 5 పరుగుల దూరంలో… ఖవాజా నాటౌట్ గా మిగిలిపోవాల్సి వచ్చింది.
190కి పైగా పరుగులు చేసి క్రీజ్ లో ఉన్న సమయంలో… ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం వల్ల డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయిన బ్యాటర్లలో… ఖవాజా మూడోవాడు. తొలి బ్యాటర్ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు సర్ ఫ్రాంక్ వారెల్. 1960లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో వారెల్ 197 పరుగులు వద్ద ఉన్నప్పుడు… కెప్టెన్ గెరీ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. దాంతో… ఒక బ్యాటర్ 190కి పైగా పరుగులతో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తొలి జట్టుగా విండీస్ రికార్డులకెక్కింది.
ఇక 2004లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో… ముల్తాన్ లో ఆడిన తొలిటెస్టులో… కెప్టెన్ ద్రవిడ్ నిర్ణయం కారణంగా సచిన్ డబుల్ సెంచరీ రికార్డును మిస్సయ్యాడు. ఈ టెస్టులో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. సచిన్ 194 పరుగుల వద్ద నాటౌట్గా ఉన్న సమయంలో… ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేస్తూ ద్రవిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇది సచిన్ అభిమానులకు విపరీతమైన ఆగ్రహం తెప్పించింది. కానీ పాక్పై ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించాక… అంతా ఆ విషయాన్ని మర్చిపోయారు.