Jay Shah set to become new ICC chairman Will Replace Greg Barclay: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గా మన భారతీయుడు ఎంపిక కానున్నాడా? అంటే అవుననే క్రికెట్ నిపుణులు అంటున్నారు. బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోంమంత్రి తనయుడు జైషా ఈ పదవిని అధిరోహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఐసీసీ ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్ క్లే ప్రస్తుత పదవీ కాలం నవంబరు 30తో ముగియనుంది.
అయితే ఆయన మూడోసారి బరిలో నిలవకూడదని నిర్ణయించు కోవడంతో సడన్ గా రేస్ లోకి జై షా వచ్చారు. దీంతో నెట్టింట ఒక్కసారి సెగ రేగింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పీఠంపై మన భారతీయుడు ఉండటం తథ్యమని నెటిజన్లు అప్పుడే ఢంకా భజాయిస్తున్నారు. మరి జైషా పోటీ పడతాడా? లేదా? అనేది ఈ నెల 27లోపు తేలిపోతుంది. ఎందుకంటే నామినేషన్ దాఖలు చేసేందుకు అదే ఆఖరి రోజు కావడంతో సస్పెన్స్ ఎక్కువ కాలం కొనసాగదని అంటున్నారు.
ఇప్పటికే జైషా ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు జైషా అధ్యక్షుడిగా ఉన్నాడు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు ఐసీసీ అధ్యక్ష పదవికి ఎంపికైతే ఈ రెండింటికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాసుల వర్షం కురిపించే బీసీసీఐ పదవిని జైషా వదులుకుంటాడా? అనేది ఒక సస్పెన్స్ నడుస్తోంది.
ఎందుకంటే ఇండియాలో క్రికెట్ కి ఉన్న గ్లామర్ వేరు.. అదే ఐసీసీ ప్రెసిడెంట్ అయితే బాధ్యతలెక్కువ. తలనొప్పులు ఎక్కువ. అన్ని దేశాలను సమన్వయం చేసుకోవాలి. ఇంత పని మరి నెత్తినెట్టుకుని మోస్తాడా? లేదా? అనేది నాలుగైదు రోజుల్లో తేలిపోనుంది.
నిబంధనల ప్రకారం ఐసీసీ ఛైర్మన్ పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. అయితే ఒక అభ్యర్థి మూడుసార్లు పోటీ పడే అవకాశం ఉంది. ప్రస్తుత చైర్మన్ న్యూజిలాండ్ కి చెందిన బార్ క్లే నాలుగేళ్లు పూర్తి చేశాడు. మూడో సారి పోటీ చేయనని తేల్చి చెప్పేశాడు. దీంతో నవంబరు 30న పదవీ కాలం అయిపోయి, దిగిపోనున్నాడు.
Also Read: బీసీసీఐకి.. కాసులు కురిపిస్తున్న ఐపీఎల్
ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉంటాయి. 9 ఓట్లు సాధించిన వ్యక్తి విజయం సాధిస్తాడు. అయితే జై షా ఇప్పుడు ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘం అధిపతిగా ఉన్నారు. అందువల్ల ఐసీసీలో జరిగే వ్యవహారాలన్నింటిపై ఆయనకు అనుభవం ఉంది. అంతేకాదు ఓటు హక్కు కలిగిన చాలా దేశాలు.. షా పట్ల సానుకూలతతో ఉన్నాయి.
అన్నింటికి మించి జైషా తండ్రి అమిత్ షా భారతదేశ హోంమంత్రిగా ఉన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా జైషా ఎంతో బలోపేతంగా ఉన్నాడు. అంతేకాదు బీసీసీఐ కార్యదర్శిగా భారత క్రికెట్ ను సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. ఇకపోతే బీసీసీఐ పదవీ కాలం జైషాకి మరో ఏడాది మాత్రమే ఉంది.