Ishan Kishan – Team India (sports news today):
ఆధునిక క్రికెట్ లో ఇషాన్ కిషన్ యువ సంచలనం. ఒక్కసారిగా టీమ్ ఇండియాలోకి దూసుకొచ్చి చాలా వేగంగా ఎదిగాడు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కాకపోతే అంతేవేగంగా పతనం దిశగా సాగిపోతున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ముందుకొచ్చింది. ఒకవైపున టెస్ట్ క్రికెట్ లో వికెట్ కీపర్ సరైన వారు లేక అవస్థలు పడుతోంది. ఈ టైమ్ లో ఇషాన్ కిషన్ ఉంటే, తన కెరీర్ కి పెద్ద ప్లస్ అయ్యేదని అందరూ అనుకుంటున్నారు.
సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్ కు అవకాశాలు రాలేదు. దాంతో తను టూర్ మధ్యలోంచే వచ్చేశాడు. అంతకు ముందు 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ స్క్వాడ్ లో ఉన్నాడు. గిల్ మూడు మ్యాచ్ లకు రాకపోవడంతో తనే ఆడాడు. కానీ విఫలమయ్యాడు. తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో ఒక దాంట్లో బాగా ఆడి, రెండిట్లో విఫలమయ్యాడు.
సౌతాఫ్రికా నుంచి మధ్యలోనే వచ్చి, ఎవరికీ అంతుచిక్కకుండా పోయాడు. ఒకసారి అమితాబ్ టీవీ షో లో కనిపించాడంతే. ప్రస్తుతం కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో హార్దిక్ పాండ్యాతో కలిసి శిక్షణ పొందుతున్నాడు. ఆడితే ఐపీఎల్ ఆడతాను. లేదంటే టీ 20 వరల్డ్ కప్ లో ఆడతాననే ధ్రడ నిశ్చయంతో ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే రంజీ ట్రోఫీలో ఆడేందుకు విముఖత చూపించాడు.
Read More: ఆడేది ఎవరు? కూర్చునేది ఎవరు? .. రేపే ఇండియా-ఇంగ్లాండ్ మూడో టెస్ట్
ఒకవైపు నుంచి ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ల్లో వికెట్ కీపర్ సమస్య టీమ్ ఇండియాను పట్టి పీడిస్తోంది. కేఎస్ భరత్ కీపింగ్ లో బ్రహ్మాండంగా ఉన్నా, పరుగులు చేయలేక అవస్థలు పడుతున్నాడు. ధ్రవ్ జురెల్ కొత్తవాడు. నిజానికి ఇషాన్ కిషన్ ఉండి ఉంటే, తనే వచ్చేవాడు. కానీ తను కాంట్రాక్ట్ లో ఉంటూ అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ సీరియస్ అయ్యింది. తను గ్రూప్ సిలో ఉన్నాడు. ఆడినా, ఆడకపోయినా ఏడాదికి కోటి రూపాయలు బీసీసీఐ నుంచి అందుతుంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా స్టయిల్ కొడుతున్న క్రికెటర్లకి తలబొప్పి కట్టేలా ఒక కొత్త నిబంధన తీసుకురానుంది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్లకి ఇది కనువిప్పు అని నెట్టింట జనం కామెంట్ చేస్తున్నారు.
ఇంతకీ బీసీసీఐ విధించిన నిబంధన ఏమిటంటే భారత జట్టులో స్థానం లేనప్పుడు, ఖాళీగా ఉండకూడదు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి. అలా ఆడితేనే ఐపీఎల్ లో అవకాశం ఉంటుందని ఆ నిబంధన సారాంశం. రంజీల్లో ఝార్ఖండ్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాలని బీసీసీఐ ఇప్పటికే ఇషాన్ కిషన్ ను ఆదేశించినట్టు సమాచారం.
కొంతమంది కుర్రాళ్లు ఎర్రబంతి క్రికెట్ ఆడాలని అనుకోవడం లేదు. రంజీ లేకపోతే ముస్తాక్ అలీ టీ 20లు ఆడుతున్నారు. రెడ్ బాల్ సీజన్ మొదలయ్యాక రాష్ట్ర క్రికెట్ బోర్డులకి సమాచారం ఇవ్వడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి వారిని అదుపు చేయడానికి కనీసం 3 నుంచి 4 రంజీ మ్యాచ్ లు తప్పనిసరి చేయాలని బీసీసీఐ బావిస్తోందని అన్నాడు. ఆడకపోతే ఐపీఎల్ వేలంపాటకు అనర్హుడిగా బీసీసీఐ ప్రకటించేలా ఉంది.