Duleep Trophy 2024: జాతీయ జట్టులో చోటు సంపాదించుకుని, ఎన్నో అవకాశాలు పొంది, సడన్ గా తెరమరుగై, మళ్లీ వివాదాల్లోకి జారిపోయి, ఈ క్రమంలో బీసీసీఐతో సున్నం పెట్టుకుని, ఏకంగా సెంట్రల్ కాంట్రాక్టునే కోల్పోయిన యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఏడాది తర్వాత మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ దులీప్ ట్రోఫీలో ఆడాడు.
ఇక ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసి, తన రాకను ఘనంగా చాటాడు. ఇండియా బి వర్సెస్ ఇండియా సి మధ్య జరిగిన మ్యాచ్ లో తను ‘ఇండియా సి’ తరఫున బరిలోకి దిగిన ఇషాన్ 126 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా సి.. 5 వికెట్ల నష్టానికి 357 పరుగులతో నిలిచింది.
అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్లో తను ఆడాడు. తొలి రౌండులో ‘ఇండియా డి’ తరపున ఆడాల్సి ఉంది. అయితే గాయం కారణంగా ఆడలేదు. దీంతో తన ప్లేస్ ని సంజయ్ శాంసన్ ను తీసుకొచ్చారు. ఇప్పుడందుకే మళ్లీ ఇషాన్ కిషన్ ని ఇండియా సిలో చేర్చారు.
Also Read: రింకూ, అయ్యర్, శాంసన్: ఈ ముగ్గురిలో చోటెవ్వరికి?
భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలంటే.. ప్రతి ఒక్కరు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని ఇటీవల బీసీసీఐ రూల్ విధించింది. దీంతో ఇక విధిలేని పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.
ఈ మ్యాచ్లో ఇండియా సి జట్టు 2 వికెట్ల నష్టానికి 97 పరుగుల మీదున్నప్పుడు ఇషాన్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే ధనాధన్ కొట్టుడు తనదైన స్టయిల్ లో మొదలెట్టాడు. మరో బ్యాటర్ బాబా ఇంద్రజిత్తో కలిసి ఎడాపెడా ఫోర్లు, సిక్స్లు కొట్టిపారేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 126 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. అంతేకాదు ఇంద్రజిత్ తో కలిసి 189 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
ఆ తర్వాత జట్టు స్కోరు 286 వద్ద మూడో వికెట్గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టు రేసులో తాను ఉన్నానని చెప్పకనే చెప్పాడు.