IPL:- సన్ రైజర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ టీమ్ అదరగొట్టింది. చివరి బాల్ వరకు నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఆటలో సన్ రైజర్సే విజయం సాధించింది. సెన్సేషనల్ బౌలర్ సందీప్ శర్మ.. చివరి బాల్ నోబ్ వేయడంతో మ్యాచ్ బిగ్గెస్ట్ టర్నింగ్ తీసుకుంది. 215 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ జట్టు గెలిచింది. ఈ గేమ్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్లెన్ ఫిలిప్స్ గురించే. హ్యాట్రిక్ సిక్సులు కొట్టి.. మ్యాచ్ను సన్ రైజర్స్ వైపు తిప్పేశాడు. 7 బాల్స్లో 25 పరుగులే చేసినప్పటికీ… మ్యాచ్ గెలిచిందంటే కారణం ఫిలిప్సే.
చివర్లో అబ్దుల్ సమద్ మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సిన సమయంలో ఫస్ట్ నాలుగు బంతుల్లో 11 పరుగులు చేశాడు. చివరి బాల్ కూడా సమదే సిక్స్ కొట్టి హైదరాబాద్ ను గెలిపించాడు.
ఇక సన్ రైజర్స్ ఓపెనర్లు బాగా రాణించారు. అన్మోల్ ప్రీత్ సింగ్ 25 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 55 పరుగులు చేసి మరో హాఫ్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన రాహుల్ త్రిపాఠి రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 3 సిక్సులు, 2 ఫోర్లతో 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీకి ముందు చాహల్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మరో ఎండ్లో ఉన్న క్లాసెన్ ఉన్నది కొద్దిసేపే అయినా దంచి కొట్టాడు. 12 బాల్స్లో 26 పరుగులు చేశాడు. మార్క్రమ్ నిలబడతాడనుకుంటే.. 5 బాల్స్లో 6 రన్స్ మాత్రమే చేశాడు.
అంతకు ముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్… వీరబాదుడు బాదింది. ముఖ్యంగా బట్లర్, సంజూ రెచ్చిపోయారు. యశస్వీ జైస్వాల్ ఔటయ్యాక బట్లర్ విశ్వరూపం చూపించాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బట్లర్.. ఆ తర్వాత సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. 59 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అటు సంజూ శాంసన్ కూడా 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మొత్తానికి కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన రాజస్తాన్.. 20 ఓవర్లలో 214 పరుగుల భారీ స్కోరు చేసింది.