IPL Mini Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలం దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ వేలంలో మొత్తం 70 స్లాట్లు ఉండగా.. 333 మంది దేశ, విదేశీ ఆటగాళ్లు జాబితాలో ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు మినీ వేలంలో పోటీ పడుతున్నాయి. 30 స్లాట్లను విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు.
ఆక్షనీర్ మల్లికాసాగర్ హోస్ట్ చేస్తున్న ఈ మినీ వేలంలో.. వెస్టిండీస్ ఆటగాడు రోవ్ మన్ పావెల్ కోసం కోల్ కతా, రాజస్థాన్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. కోటి రూపాయలతో మొదలైన వేలంలో.. పావెల్ ను రూ.7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రోసోవ్ ను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. రూ.2 కోట్ల కనీస ధరతో రోసోవ్ వేలం ప్రారంభమవ్వగా ఒక్క ఫ్రాంచైజీ కూడా ఇంట్రస్ట్ చూపలేదు.
హ్యారీబ్రూక్ కనీస వేలం ధరరూ.2 కోట్లతో మొదలవ్వగా.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ ను సొంతం చేసుకుంది.
ఆసీస్ టాప్ బ్యాటరైన ట్రావిస్ హెడ్ రూ.2 కోట్లతో వేలంలోకి దిగగా.. సీఎస్కే, సన్ రైజర్స్ పోటీ పడ్డాయి. తీవ్ర పోటీ మధ్య.. ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.6.80 కోట్లకు సొంతం చేసుకుంది.
ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.
తొలిసెట్ వేలంలో భారత్ ప్లేయర్లైన మనీశ్ పాండే(50 లక్షలు), కరుణ్ నాయర్(50 లక్షలు) లు కూడా అన్ సోల్డ్ గానే మిగిలారు.
రెండవ సెట్ వేలం.. ఆల్ రౌండర్ వనిందు హసరంగతో ప్రారంభమవ్వగా.. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.
కివీస్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కోసం తొలుత సీఎస్కే-ఢిల్లీ పోటీ పడ్డాయి. తర్వాత పంజాబ్ కింగ్స్-సీఎస్కే ల మధ్య పోటీ జరగ్గా.. రూ.1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ రచిన్ రవీంద్రను కొనుగోలు చేసింది.
భారత్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను కూడా చైన్నై జట్టు సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దూల్ ను సీఎస్కే రూ.4 కోట్లకు దక్కించుకుంది.
ఆప్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. బేస్ ప్రైస్ రూ.50 లక్షల వద్దే గుజరాత్ కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రూ.2 కోట్లతో బరిలోకి దిగగా.. సీఎస్కే- ముంబై పోటీ పడ్డాయి. ముంబై డ్రాప్ అవ్వగా.. ఆర్సీబీ-సీఎస్కే మధ్య తీవ్ర పోటీ జరిగింది. చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్ల భారీ ధరకు కమిన్స్ ను సొంతం చేసుకుంది.
దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయిట్జీని ముంబై సొంతం చేసుకుంది. రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.5 కోట్లకు దక్కించుకుంది.
భారత్ పేసర్ హర్షల్ పటేల్ ను రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
న్యూజిల్యాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు దక్కించుకుంది.
ఇంగ్లాండ్ పేస్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ రూ.2కోట్లతో బరిలోకి దిగగా.. పంజాబ్ కింగ్స్ రూ.4.2 కోట్లకు వేలం పాడింది.
రెండు రౌండ్లు ముగిసే సరికి.. 12 మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
మూడో రౌండ్ ఐపీఎల్ వేలం ట్రిస్టన్ స్టబ్స్ తో మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ట్రిస్టన్ ను రూ.50 లక్షలకు, కేఎస్ భరత్ ను రూ.50 లక్షలకు, చేతన్ సకారియాను రూ.50 లక్షలకు కోల్ కతా జట్టు తీసుకుంది. ఫిలిప్ సాల్ట్ అన్ సోల్డ్ గా మిగిలింది.
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ.11.5 కోట్లకు సొంతం చేసుకుంది.
భారత్ సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ కు జాక్ పాట్. రూ.2 కోట్లతో బరిలోకి వచ్చిన ఉమేశ్ ను గుజరాత్ టైటాన్స్ రూ.5.8 కోట్లకు కొనుగోలు చేసింది.
యువ బౌలర్ శివమ్ మావిని లఖ్ నవూ రూ.6.4 కోట్లకు సొంతం చేసుకుంది.
ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆల్టైమ్ రికార్డు సృష్టించాడు. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. చివరికి రూ. 24.75 కోట్లకు స్టార్క్ ను కేకేఆర్ దక్కించుకుంది.
అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్విని సీఎస్కే రూ. 8.4 కోట్లు దక్కించుకుంది. హిట్టర్ షారుఖ్ ఖాన్ను రూ. 7.4 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. భారత అన్క్యాప్డ్ ప్లేయర్ కుమార్ కుశాగ్రాకు అనుహ్య ధర దక్కింది. అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.20 కోట్లకు సొంతం చేసుకుంది.
అనక్యాప్డ్ ప్లేయర్ శుభ్మ్ దూబెను 5.8 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.మరో అన్క్యాప్డ్ ఆటగాడు యశ్ దయాల్ను రూ.5 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. సుశాంత్ మిశ్రాను రూ.2.20 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.జయదేవ్ ఉనద్కత్ను రూ. 1.6 కోట్లుకు సన్రైజర్స్ తీసుకుంది. మదుశంకను ముంబయి రూ. 4.6 కోట్లను సొంతం చేసుకుంది.