ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలానికి ముందు… ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న చాలా మంది ప్రముఖ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వద్దనుకున్నాయి. మంగళవారంతో రిటెన్షన్ లిస్ట్ సమర్పించే గడువు ముగియడంతో… ప్రాంఛైజీలు ఆటగాళ్ల తుది జాబితాలను ప్రకటించాయి. ఏ ప్రాంఛైజీలు ఏయే కీలక ఆటగాళ్లను వదులుకున్నాయో ఓసారి చూద్దాం.
కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 16 మంది ఆటగాళ్లను వేలంలోకి విడిచిపెట్టింది. వారిలో పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అజింక్య రహానే లాంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఎక్కువ మంది స్టార్ ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీ… కోల్కతా నైట్ రైడర్సే. వేలంలో కొత్త ఆటగాళ్లను కొనేందుకు కోల్కతా ఖాతాలో ఇంకా రూ. 7.5 కోట్లు ఉన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ… 12 మంది ఆటగాళ్లను వదులుకుంది. ఇందులో కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం 13 మంది ఆటగాళ్లను కాదనుకుంది. వీళ్లలో విధ్వంసకర బ్యాటర్ కీరన్ పొలార్డ్ ఉన్నాడు. వేలంలో కొత్త ఆటగాళ్లను కొనేందుకు ముంబై ఫ్రాంచైజీ ఖాతాలో ఇంకా రూ.20 కోట్లకు పైగా ఉంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్… 8 మంది ఆటగాళ్లను విడిచిపెట్టింది. వాళ్లలో డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే లాంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. వేలంలో కొత్త ఆటగాళ్లను కొనేందుకు చెన్నై ఖాతాలోనూ రూ.20 కోట్లకుపైగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుగురు ఆటగాళ్లను తప్పించింది. వారిలో శార్దూల్ ఠాకూల్, మన్దీప్ సింగ్ కీలక ఆటగాళ్లే. మినీ వేలంలో పాల్గొనేందుకు ఢిల్లీ ఖాతాలో ఇంకా 19.45 కోట్లు ఉన్నాయి.
రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ 9 మంది చొప్పున… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మందిని, లక్నో సూపర్ జెయింట్స్ ఏడుగురిని, గుజరాత్ టైటాన్స్ ఆరుగురు ఆటగాళ్లను వదులుకున్నాయి. అయితే ఈ ఐదు ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లలో స్టార్ ప్లేయర్లు ఎవరూ లేరు.