IPL : ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు కాపాడుకుంది. గుజరాత్ విజయానికి చివరి ఓవర్ లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇషాంత్ శర్మ అద్భతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఢిల్లీ జట్టు 5 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. అమన్ హకిమ్ ఖాన్ (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. అక్షర్ పటేల్ (27) , రిపల్ పటేల్ (23) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ 10 పరుగులు దాటలేదు. దీంతో ఢిల్లీ ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. గుజరాత్ బౌలర్లలో షమీ 4 వికెట్లు , మోహిత్ శర్మ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
గుజరాత్ ను ఢిల్లీ బౌలర్లు మొదటి ఓవర్ నుంచే వణికించారు. వృద్ధిమాన్ సాహా (0), శుభ్ మన్ గిల్ (6) విజయ్ శంకర్ (6), డేవిడ్ మిల్లర్ (0) వికెట్లు వెంటవెంటనే పడ్డాయి. దీంతో గుజరాత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభినవ్ మనోహర్ (26)తో కలిసి కెప్టెన్ హార్థిక్ పాండ్యా (59 నాటౌట్) జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు.
మనోహర్ అవుటైన తర్వాత రాహుల్ తెవాటియా (20, 7 బంతుల్లో 3 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ విజయం ఖాయమనిపించింది. చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు చేయాల్సి ఉండగా.. 19వ ఓవర్ చివరి మూడు బంతులకు తెవాటియా సిక్సులు కొట్టాడు. ఆ ఓవర్ లో మొత్తం 21 పరుగులు వచ్చాయి. దీంతో గుజరాత్ విజయానికి చివరి ఓవర్ లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ ఈ ఓవర్ ను వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 బంతికి తెవాటియా అవుట్ అయ్యాడు. చివరికి గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ 5 పరుగుల తేడాతో గెలిచింది.
ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ , ఇషాంత్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. నోకియా, కులదీప్ యాదవ్ కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.