Punjab Kings vs Delhi Capitals (ipl 2024 live score):సామ్ కరన్ (63, 47 బంతుల్లో; 6X4, 1X6), లివింగ్స్టోన్(38, 21 బంతుల్లో; 2X4, 3X6) రాణించడంతో పంజాబ్ ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ధావన్, బెయిర్స్టో ధాటిగా ఆడారు. కేవలం 3.1 ఓవర్లలో 34 పరుగులు జోడించారు. 16 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసిన కెప్టెన్ ధావన్ ఇషాంత్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత బెయిర్ స్టో అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఈ సమయంలో ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కరన్తో జతకట్టారు. 84 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సింగ్ అవుట్ అయ్యాడు.
జితేశ్ శర్మ కుల్దీప్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో లివింగ్స్టోన్ తో జతకట్టిన కరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 బంతుల్లో 28 కొట్టాల్సిన తరుణంలో కరన్ 6,4 కొట్టగా, లివింగ్స్టోన్ 6 కొట్టి పంజాబ్ను విజయానికి చేరువయ్యేలా చేశాడు. 10 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో సామ్ కరన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత బంతికి శశాంక్ సింగ్ డకౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కష్టాల్లో పడింది. హర్ప్రీత్ బ్రార్ ఇచ్చిన క్యాచ్ను వార్నర్ వదిలేసాడు. చివరి ఓవర్లో 6 పరుగులు కొట్టాల్సి ఉండగా సిక్స్ కొట్టి విజయాన్నందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇంపాక్ట్ సబ్గా వచ్చిన పోరెల్ కేవలం 10 బంతుల్లో 32 పరుగులు చేశాడు. హర్షల్ వేసిన చివరి ఓవర్లో వరుసగా 4, 6, 4, 4, 6 కొట్టి జట్టు స్కోర్ను 170 పరుగులు దాటించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. కేవలం 3.2 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు.
ఫోర్తో ఖాతా తెరిచిన మిచెల్ మార్ష్(20, 12 బంతుల్లో; 2X4, 2X6) సామ్ కరన్ వేసిన తొలి ఓవర్లో 2 ఫోర్లు కొట్టాడు. రెండో ఓవర్లో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్షదీప్ సింగ్ ఓవర్లో వరుసగా 6,4 కొట్టాడు. రబాడ వేసిన 3వ ఓవర్లో మరో సిక్స్ బాదిన మార్ష్, తర్వాత ఓవర్లో అర్షదీప్ బౌలింగ్లో సిక్స్ కొట్టి తర్వాత బంతికే పెవిలియన్ చేరాడు. దీంతో జట్టు స్కోర్ 39 వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత ఓవర్లో వార్నర్ రబాడ బౌలింగ్లో 4,6 కొట్టి కేవలం 5 ఓవర్లలో జట్టు స్కోర్ను 50 దాటించాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్ 54/1.
29 పరుగులు చేసి వార్నర్ హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో పంత్ క్రీజులోకి వచ్చాడు. ఇంకో పక్క హోప్ 33 పరుగులు చేసి రబాడ బౌలింగ్లో వెనుదిరిగాడు. రెండు ఫోర్లతో అలరించిన పంత్ హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే రికీ భుయ్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది.
స్టబ్స్(5) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అక్షర్ పటేల్ (21, 13 బంతుల్లో) రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి మంచి ఊపు మీదున్న సమయంలో రనౌట్ అయ్యాడు. దీంతో 138 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో పోరెల్ చెలరేగడంతో ఢిల్లీ పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.