IPL 2024 Auction : 2024జూన్ నెలలో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ నకు ముందే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకు సన్నాహాలు మొదలెట్టేసింది. ఐపీఎల్ వేలం ప్రక్రియకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు.
2024 సీజన్ కి సంబంధించి డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఏయే ఆటగాళ్లను తమ దగ్గర ఉంచుకుంటారు? ఎవరిని వదిలించుకుంటారు? ఆ వివరాలను నవంబర్ 26లోగా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ అంశంపై ఫ్రాంచైజీలు కసరత్తులు ప్రారంభించాయి. మొత్తంగా 50 మంది ఆటగాళ్లను దుబాయ్ వేదికగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఒక 30 నుంచి 40 మధ్య ఆటగాళ్లను వదిలించుకునేలా ఉన్నాయి.
మొత్తానికి ఐపీఎల్ 2024 మార్చి నెలలో ప్రారంభమై మే నెలలో ముగుస్తాయని అంటున్నారు. సుమారు రెండు నెలలు ఐపీఎల్ మ్యాచ్ లు ఉండే అవకాశం ఉంది. రోజుకొక మ్యాచ్, రోజుకొక ధమాకా అన్నట్టుగా ఉంటుందని క్రికెట్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అయితే ఇదే సమయంలో తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడే పదో తరగతి. ఇంటర్మీడియట్, డిగ్రీ తదితర పబ్లిక్ పరీక్షలుంటాయని, వీరింక చదువులు మానేసి క్రికెట్ దగ్గరే కూర్చుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ టైమ్ లో ఎంత ఆపినా ఆగరని, ఇంక వాడి మనసు ఎంతసేపు మ్యాచ్ మీద, జరిగిపోయిన తర్వాత వాడిచ్చే రివ్యూలు, ఫ్రెండ్స్ తో ఛాటింగులు, డిస్కషన్లు, అరుపులు, కేకలు వాటి మీదే ఉంటుందని గగ్గోలు పెడుతున్నారు.
అయినా అంత ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లు మార్చిలో ఐపీఎల్ ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆలోచించరా? అని తిట్టిపోస్తున్నారు. అయితే మరికొందరు అనేమాటేమిటంటే ..ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. కంగారుపడకండి. వాళ్లు కూడా ఆలోచిస్తారని చెబుతున్నారు. ఎందుకంటే జూన్ లోనే టీ 20 వరల్డ్ కప్ ఉండటం వల్ల ఐపీఎల్ ముందుకి వచ్చిందని వివరిస్తున్నారు.