IPL : కీలక మ్యాచ్ లో రాయస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడింది. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. బెంగళూరులో చేతిలో 112 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ( 55), గ్లెన్ మాక్స్ వెల్ (54) అద్భుతంగా ఆడారు. హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివరిలో అనూజ్ రావత్ ( 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో బెంగళూరు స్కోర్ 170 దాటింది.
లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ తడబడింది. ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ డకౌట్ అయ్యారు. కెప్టెన్ సంజూ శాంసన్ (4), పడిక్కల్ (4) కూడా విఫలమయ్యారు. ఒకవైపు సిమ్రాన్ హెట్ మేయర్ (35) నిలబడినా మరో బ్యాటర్ సహకారం అందించలేదు. ధ్రువ్ జురెల్ (1), అశ్విన్ (0) వెంటవెంటనే అవుట్ అయ్యారు. చివరికి రాజస్థాన్ జట్టు 10.3 ఓవర్లలోనే 59 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
బెంగళూరు బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. పార్నెల్ 3 వికెట్లు, బ్రాస్ వెల్ , కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. మాక్స్ వెల్ కు ఒక వికెట్ దక్కింది. పార్నెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ ఐపీఎల్ సీజన్ మొదటి 5 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్ టాప్ లో ఉంది. గుజరాత్ తర్వాత కచ్చితంగా రాజస్థాన్ ప్లే ఆఫ్ కు చేరుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్ ల్లో 6 ఓడిపోయింది. గత 5 మ్యాచ్ ల్లో నాలుగు పరాజయాలు చవిచూసింది. ఇప్పుడు రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇతర జట్ల ప్రదర్శన ఆధారపడిఉంది. ఒకవేళ చివరిలో ఓడితే రాజస్థాన్ కథ ముగిసినట్టే.