Mumbai Indians : ఇంత జరుగుతున్నా ఐపీఎల్ లో కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. అది తనకు సంబంధం లేని అంశం అన్నట్టు తన మానాన తను సౌతాఫ్రికా టూర్ కి బయలుదేరుతున్నాడు.
తనకి ముందే తెలుసా? లేక తనే వద్దన్నాడా? లేక ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా? ఏవీ బయటకు రావడం లేదు. అంత అర్జెంటుగా పక్క జట్టు కెప్టెన్ ను తీసుకురావల్సిన అగత్యం ఎందుకొచ్చిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగినా బయట మంటలు మాత్రం ఆగడం లేదు. క్షణక్షణానికి చెలరేగిపోతున్నాయి. అవి ముంబయి ఇండియన్స్ జట్టుని దావానంలా దహించి వేస్తున్నాయి. ప్రస్తుతం వీటినెలా ఆర్పాలని యాజమాన్యం శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీంతో కొన్ని ఫీలర్స్ వదులుతున్నారు.
సంవత్సరం ముందే రోహిత్ శర్మకు కెప్టెన్సీ మార్పుపై చెప్పినట్టు వదంతులు వినిపిస్తున్నారు. అందుకు తగినట్టుగా, అన్నమాట ప్రకారం సంవత్సరం తర్వాత తనని తప్పించినట్టు చెబుతున్నారు. అంతేగానీ ఇది వాంటెడ్లీ జరిగింది కాదని అంటున్నట్టు సమాచారం. తను మామూలు ఆటగాడిగా జట్టుతో కలిసి ఆడతానని తెలిపాడని అంటున్నారు. దిద్దుబాటు చర్యలు ఎలా చేయాలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కి అర్థం కావడం లేదని సమాచారం. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిపోయిందని అంటున్నారు.
కానీ వస్తున్న వార్తలపట్ల ముంబయి జట్టులో ఎవరూ స్పందించడం లేదు. సూర్యకుమార్ మాత్రం బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పెట్టి తన అభిప్రాయం చెప్పకనే చెప్పాడు. అంత అత్యవసరంగా హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి తప్పించి మరీ ఇక్కడకు తీసుకురావడం, అదీ రోహిత్ శర్మని ఉన్నపళంగా తప్పించడం, అంత కొంపలంటుకుపోయే అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడూ జట్టుకోసమే తప్ప, తన వ్యక్తిగత రికార్డుల కోసం రోహిత్ శర్మ ఆడడనే సంగతి అందరికీ తెలిసిందే. 99 పరుగుల వద్ద కూడా లాఫ్టెడ్ షాట్స్ కొట్టడం తనకే చెల్లింది. తను కూడా మిగిలిన ఆటగాళ్లలా 90కి వచ్చేసరికి జాగర్త పడుతూ ఆడుతుంటే, ఈ పాటికి తన ఖాతాలో ఎన్నో సెంచరీలు, అర్థ సెంచరీలు ఉండేవని క్రీడా విశ్లేషకులు అంటుంటారు.
అంతేకాదు రోహిత్ శర్మ ఎటాకింగ్ ప్లే అచ్చు గుద్దినట్టు టీ 20కి సరిపోతుంది. అలాగే ముంబై జట్టుకి అయిదు సార్లు టైటిల్స్ అందించిన ఘనత తనదే. ఇన్ని ఉండి హఠాత్తుగా ముంబై ఇండియన్స్ యాజమన్యం ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.