INDW Vs AUSW : ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ను కోల్పోయి, తీవ్ర విమర్శల పాలైన అమ్మాయిలు తేరుకున్నారు. టీ 20 సిరీస్ లో భాగంగా ముంబయి వాంఖేడీ స్టేడియంలో జరిగిన తొలి టీ 20లో విజయం సాధించారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 141 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం టీమ్ ఇండియా ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఇద్దరూ ధనాధన్ ఆఫ్ సెంచరీలు చేయడంతో ఇంకా 14 బంతులు మిగిలి ఉండగానే అమ్మాయిలు విజయం సాధించారు. మూడు టీ 20ల సిరీస్ లో 1-0 తో ముందడుగు వేశారు.
టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా తొలి నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. భారత్ బౌలర్ టైటాస్ సాధు దెబ్బకి ఆస్ట్రేలియా గిలగిల్లాడింది. తను 4 వికెట్లు తీసి ఆసిస్ వెన్నువిరిచింది.
ఆసిస్ ఓపెనర్లు హీలీ (8), మూనే (17) త్వరగానే అవుట్ అయిపోయారు. ఫస్ట్ డౌన్ మెక్ గ్రాత్ డకౌట్ అయ్యింది. తర్వాత గార్డనర్ సున్నా పరుగులకే పెవిలియన్ బాట పట్టింది. దీంతో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆసిస్ దిక్కుతోచని స్థితిలో పడింది. ఎలిసే పెర్రీ (37), లిచ్ ఫీల్డ్ (49) ఇద్దరూ కాసేపు ఆదుకున్నారు. తర్వాత వచ్చినవాళ్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో ఆసిస్ 141 పరుగల వద్దకు వచ్చి ఆగిపోయింది.
సాధు 4, శ్రేయాంక పాటిల్ 2, దీప్తి శర్మ 2, రేణుక సింగ్, అమన్ జ్యోత్ కౌర్ చెరో ఒక వికెట్ తీసుకున్నారు.
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఇద్దరూ అర్థ సెంచరీలు సాధించారు. స్మృతి 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 54 పరుగులు చేసి అవుట్ అయ్యింది. షెఫాలీ వర్మ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
చివర్లో రోడ్రీగస్ వచ్చి ఫోర్ కొట్టి భారత్ ను విజయతీరాలకు చేర్చింది. ఇందులో ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చాలా అధ్వానంగా ఉంది. క్యాచ్ లను వదిలేశారు. బైస్ వదిలేశారు. ఫీల్డింగ్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఏదో బ్యాటింగ్ చేద్దామని వచ్చినట్టుగానే ఆడి, తగిన మూల్యం చెల్లించుకున్నారు.
వన్డే సిరీస్ కోల్పోయి పలు విమర్శలు పాలైన టీమ్ ఇండియా మళ్లీ టీ 20లో విజయ కేతనం ఎగురవేయడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మళ్లీ రెండో టీ 20 జనవరి 7న జరగనుంది. నిర్ణయాత్మకమైన ఆ మ్యాచ్ కూడా గెలిచి వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలని అభిమానులు కోరుతున్నారు.