Richest Cricketer in India: 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఒక యువకుడు అరంగేట్రం చేశాడు. కానీ అతను ఇప్పుడున్న సమకాలీన క్రికెటర్లు సచిన్, కొహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఇలా వీళ్లే కాదు.. ప్రపంచంలోని క్రికెటర్లు అందరికన్నా ధనవంతుడు.. అపర కుబేరుడు. ఏదో సరదాగా క్రికెట్ లోకి రాలేదు. సీరియస్ గానే వచ్చాడు.
2018లో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. అతన్ని ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే మధ్యప్రదేశ్ తరపున ఆడి ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, నాలుగు లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తం 414 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 103 నాటౌట్ గా ఉంది.
ఇక లిస్ట్-ఏ లో చూస్తే 36 పరుగులే చేశాడు. కాకపోతే 22 ఏళ్లకే, అంటే 2019లో అనూహ్యంగా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇంతకీ అతనెవరో కాదు. ఆర్యమాన్ బిర్లా. దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్న కుమార్ మంగళం బిర్లా కుమారుడు. ఆర్యమాన్ బిర్లా 1997 జులై 9న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు.
Also Read: రోహిత్ రికార్డుని దాటేసిన జో రూట్.. సచిన్ రికార్డు కూడా ?
అయితే తను రిటైర్ కావడానికి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా కారణమని అంటున్నారు. బహుశా తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను వదల్లేక, రూ.70,000 కోట్ల ఆస్తులను చూసుకోలేక సతమతమై, తనెంతో ప్రేమించే ఆటకు దూరమయ్యాడని అంటున్నారు.
ప్రస్తుతం వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నాడు. నిజానికి తనకి ఉన్న ఖరీదైన కార్లు, వాచీలు, ఇతర విలువైన వస్తువులన్నీ కలిపితే దాదాపు రూ. 75 వేల కోట్లపైన ఉంటాయని అంటున్నారు. తర్వాత క్రికెట్ ను వదిలి వ్యాపార ప్రపంచంలో అడుగు పెట్టాడు. అక్కడ విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకడిగా ఆర్యమాన్ నిలిచాడు.
2023లో ఆర్యమాన్, అతని సోదరి అనన్య బిర్లా, ఇద్దరూ కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన సంస్థ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. అలాగే తను సొంతంగా ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి గ్రూప్లే కాకుండా అనేక ఇతర కంపెనీల్లో డైరెక్టర్ హోదాలో ఉన్నాడు.