Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత్ కథ ముగిసింది. ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్ లో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. గెలుపు ముంగిట నిర్లక్ష్యంతోనే ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది.
ఆదిలో ఎదురుదెబ్బ.. ఎదురుదాడితో లక్ష్యం దిశగా..
173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది . స్టార్ ఓపెనర్లు స్మృతి మంధాన ( 2), షెఫాలీ వర్మ (9) త్వరగా అవుట్ అయ్యారు. ఆ వెంటనే యాస్తికా భాటియా (4) రనౌట్ అయ్యింది. దీంతో టీమిండియా 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ చెలరేగి ఆడారు. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దీంతో స్కోర్ పరుగులు పెట్టింది. నాలుగో వికెట్ కు 69 పరుగులు జోడించిన తర్వాత.. రోడ్రిగ్స్ ( 24 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులు) అనవసరమైన షాట్ కు వెళ్లి పెవిలియన్ కు చేరింది. ఆ తర్వాత రిచా ఝోష్ తో కలిసి హర్మన్ భారత్ ను గెలుపు దిశగా తీసుకెళ్లింది.
హర్మన్ నిర్లక్ష్యం.. రనౌట్..
భారత్ విజయానికి 33 బంతుల్లో 41 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. క్రీజులో ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఉన్నారు. ఇక భారత్ ఫైనల్ చేరడం ఖాయమనిపించింది. కానీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ నిర్లక్ష్యం భారత్ కొంపముంచింది. రెండో పరుగు తీసే క్రమంలో క్రీజులో బ్యాట్ పెట్టకుండా బంతి చూస్తూ హర్మన్ పరుగెత్తింతి. ఇంతలో ఆసీస్ కీపర్ త్రో అందుకుని వికెట్లు గిరాటు వేసింది. అంతే భారత్ ఆశలు గల్లంతయ్యాయి. హర్మన్ రనౌట్ గా పెవిలియన్ చేరింది. ఆ వెంటనే రిచా ఘోష్ కూడా భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా మ్యాచ్ పై పట్టు బిగించింది.
దీప్తి శర్మ (20 నాటౌట్ ) స్నేహ రాణా ( 11) వేగంగా ఆడలేకపోయారు. దీంతో చివరి రెండో ఓవర్లలో 20 పరుగులు చేయాల్సి ఉండగా… 19 ఓవర్ లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి ఓవర్ లో విజయానికి 16 పరుగుల చేయాల్సి ఉండగా .. భారత్ 10 పరుగులు మాత్రమే చేయగలింది. దీంతో ఆసీస్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డ్నర్ , బ్రౌన్ రెండేసి వికెట్లు తీశారు. షట్ , జోనెసెన్ కు తలో వికెట్ దక్కాయి.
ఆరంభం ఆదుర్స్. .చివరిలో తుస్..
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తొలి పది ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత్ బౌలర్లు చివరిలో తేలిపోయారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బేత్ మూనీ (54), మెగ్ లానింగ్ ( 49 నాటౌట్) , గార్డ్నర్ (31 ), హీలీ ( 25) రాణించారు. భారత్ బౌలర్లలో శిఖా పాండే 2 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. చివరి ఓవర్ లో రేణుకా సింగ్ 18 పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా స్కోర్ 170 పరుగులు దాటింది. ఆలౌండర్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన గార్డ్నర్ కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లాండ్ – దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో విజేతతో ఆస్ట్రేలియా ఫైనల్ లో తలపడుంది.