IND w Vs ENG w : భారత్ మహిళా క్రికెట్ లో నయా చరిత్ర ఆవిష్కృతమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళా క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా నిలిచింది. నవీ ముంబయి వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ లో ఈ అద్భుతం చోటు చేసుకుంది.
అంతేకాదు ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన టీమ్ ఇండియా సంచలన విజయం నమోదు చేసింది.
అలాగే ఇన్నాళ్లకి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై తొలిసారి విజయం సాధించింది. ఇక 347 భారీ పరుగుల తేడాతో విజయం సాధించిన తొలి జట్టుగా కీర్తి గడించింది.
సొంతగడ్డపై ఇంగ్లాండ్ మహిళల టీమ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 428 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ సతీష్ శుభా(69), జెమీమా రోడ్రిగ్స్(68), యస్తికా భాటియా(66), దీప్తి శర్మ(67) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అందుకు బదులుగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీప్తీ శర్మ కేవలం 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ విలవిల్లాడింది. నాట్ స్కీవర్ బ్రంట్(59) ఒక్కరే హాఫ్ సెంచరీతో రాణించింది. తనకెవరూ సహాయ సహకారాలు అందించేవారే కరవయ్యారు. దాంతో తను ఒంటరి పోరాటం చేసింది. చివరికి టీమిండియాకు 392 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
దీంతో భారత్ కి తొలి ఇన్నింగ్స్ లో 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అయితే ఫాలో ఆన్ ఇవ్వకుండా టీమ్ ఇండియా బ్యాటింగ్ కి దిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లకి 186 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
ఇందులో హర్మన్ ప్రీత్ కౌర్ (44) నాటౌట్ గా నిలిచింది.
దీంతో 479 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఈసారి 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఈసారి ఏదీ వారికి కలిసి రాలేదు.
కేవలం 27.3 ఓవర్లలోనే ఇంగ్లాండ్ కథ ముగిసిపోయింది. ఒక్క సెషన్ కూడా పూర్తి కాకుండానే ఆలౌట్ అయిపోయింది.
కనీసం 50 ఓవర్ల వన్డే మ్యాచ్ లా కూడా జరగలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఓపెనర్లు సోఫియా (15), అమీ బీమోంట్ (17) క్రీజులో ఉండి కాసేపు ఆశలు రేపారు. కానీ అంతలోనే అవుట్ అయి పెవీలియన్ దారి పట్టారు.
ఇక్కడ కూడా దీప్తీ శర్మ మ్యాజిక్ రిపీట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీస్తే, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. తనతో పాటు పూజా వస్త్రాకర్ 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది.
తొలి ఇన్నింగ్స్ లో ఆఫ్ సెంచరీ చేసిన నాట్ స్కీవర్ ఈసారి డకౌట్ అయి వెనుతిరిగింది. మిగిలిన బ్యాటర్లలో వ్యాట్ 12, సోఫీ 10, కేట్ క్రాస్ 16, ఇంకా ఓపెనర్లు రెండంకెల స్కోర్ చేశారు.
దీంతో టీమ్ ఇండియా 347 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి నయా చరిత్ర లిఖించింది. ఇప్పటి వరకు శ్రీలంకపై 1998లో పాకిస్తాన్ 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే ఇంతవరకు అతిపెద్ద విజయంగా ఉంది. ఇప్పుడా రికార్డ్ ని టీమ్ ఇండియా మహిళల జట్టు వెనక్కి నెట్టి నయా చరిత్ర సృష్టించింది.