Football : దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య ఛాంపియన్షిప్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఈ టోర్ని ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్లో అదరగొట్టింది. 4-0 గోల్స్ తేడాతో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి చెలరేగి ఆడాడు. హ్యాట్రిక్ గోల్స్ కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్ దూకుడుగానే ఆడింది.
ఇటీవలే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ను భారత్ కైవసం చేసుకుంది. అదే జోరుతో శాఫ్ టోర్నిలోకి అడుగుపెట్టింది. ఛెత్రి 10వ నిమిషంలోనే ఫీల్డ్ గోల్ కొట్టాడు. ఆ తర్వాత 6 నిమిషాలకే పెనాల్టీని గోల్గా మలిచాడు. భారత్ అదే దూకుడును కొనసాగించినా మరో గోల్ చేయకుండా పాక్ అడ్డుకుంది. సెకండాఫ్ లో చాలాసేపటి వరకు పాక్ భారత్ ను నిలువరించింది.
74వ నిమిషంలో పాక్ ఆటగాళ్లు ఛెత్రిని కింద పడేశారు. దీంతో భారత్ కు పెనాల్టీ కిక్ వచ్చింది. ఛెత్రి దాన్ని గోల్గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. ఆ తర్వాత 7 నిమిషాలకే సబ్స్టిట్యూట్ ఉదంత సింగ్ గోల్ కొట్టాడు. దీంతో భారత్ ఆధిక్యం 4-0కు చేరింది. మ్యాచ్ ముగిసేలోపు పాక్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. దీంతో భారత్ 4-0 తేడా విజయభేరి మోగించింది. శనివారం భారత్ నేపాల్ తో తలపడుతుంది.
మ్యాచ్ ఫస్టాఫ్ ముగుస్తుందనగా.. భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య కవ్వింపు చర్యలు చోటుచేసుకున్నాయి. పాక్ ఆటగాడు బంతిని విసరబోతుండగా అక్కడే ఉన్న భారత కోచ్ ఇగార్ స్టిమాక్ చేత్తో వెనుక నుంచి దాన్ని నెట్టేశాడు. దీంతో రిఫరీ భారత్ కోచ్ కు రెడ్ కార్డు చూపించాడు. ఆ తర్వాత భారత్, పాక్ ఆటగాళ్లు పరస్పరం వాదించుకున్నారు. ఒకరినొకరు నెట్టుకునే ప్రయత్నం చేశారు.
ఆసియాలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన సెకెండ్ ఫ్లేయర్ గా సునీల్ ఛెత్రి రికార్డు సృష్టించాడు. 138 మ్యాచుల్లో 90 గోల్స్ సాధించాడు. మలేసియా ఆటగాడు మొక్తార్ దహారి 142 మ్యాచ్ల్లో 89 గోల్స్ సాధించాడు. అతడిని ఛెత్రి దాటేశాడు. ఇరాన్ ఆటగాడు అలీ డాయ్ 149 మ్యాచ్ల్లో 109 గోల్స్తో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.