సౌతాఫ్రికా గడ్డపై రికార్డులే కాదు చెత్త రికార్డులు కూడా నమోదయ్యాయి. ఒక బ్యాటర్ ని 150 పరుగుల లోపు అవుట్ చేయలేకపోవడం, టీమిండియా బౌలర్ల వైఫల్యంగా చెబుతున్నారు. దీనిని టీమ్ మేనేజ్మెంట్ నిశితంగా పరిశీలించాలని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలిటెస్ట్ లో డీన్ ఎల్గర్ 185 పరుగులు చేయడం, ఐదుగురు ప్రధాన బౌలర్లు ఉండి కూడా ఏ దశలోనూ అవుట్ చేయలేకపోవడం సిగ్గు పడాల్సిన విషయమని అంటున్నారు. ఇది టీమ్ ఇండియాకు అప్రదిష్ట అని కూడా అంటున్నారు. అంతటి గొప్పటీమ్ ని రోహిత్ కి ఇచ్చారని సెలక్షన్ కమిటీని నెట్టింట బాగా ఆడుకుంటున్నారు.
తొమ్మిదేళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్ లో మూడుసార్లు ఒక బ్యాటర్ కు 150 పైగానే పరుగులు సమర్పించుకున్న బౌలర్లున్నటీమ్ గా భారత్ చెత్త రికార్డ్ నమోదు చేసుకుంది. డీన్ ఎల్గర్ కంటే ముందు ఈ ఏడాది టీమిండియాపై ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (180), ట్రావిస్ హెడ్(163) 150 ప్లస్ రన్స్ చేశారు. మరి సెలక్షన్ కమిటీ దీనికే సమాధానం చెబుతుందని నెట్టింట అప్పుడే ట్రోలింగులు మొదలయ్యాయి.
రోహిత్ శర్మయినా ఏం చేయగలడు…తనకిచ్చిన టీమ్ తోనే ఆడగలడు గానీ, తనెళ్లి బౌలింగ్ చేయలేడు కదా అంటున్నారు. లేదంటే వన్డే వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై తొమ్మిదిమందితో బౌలింగ్ చేయించిన రోహిత్ శర్మ ఈసారెందుకు ఆ ప్రయత్నం చేయలేదని కొందరు గుర్తు చేస్తున్నారు. సరదాగైనా అలా చేయాల్సిందని అంటున్నారు. కొహ్లీ, గిల్, శ్రేయాస్ అందరూ బౌలింగ్ చేస్తారు. అంతగా కావాలంటే రోహిత్ శర్మ కూడా బౌలింగ్ చేస్తాడు. తలా ఒక రెండేసి ఓవర్లు వేస్తే, బ్యాటర్లు కన్ ఫ్యూజ్ అయ్యే అవకాశాలుండేవని అంటున్నారు.
గతంలో అజారుద్దీన్ దగ్గర నుంచి ఎంతోమంది టెస్ట్ మ్యాచ్ లో బ్యాటర్లతో బౌలింగ్ చేయించేవారు. ఇప్పుడేం కొంపలు మునిగిపోలేదు కదా…ఒక ప్రయత్నం చేసి ఉండాల్సిందని చెబుతున్నారు. అయితే రోహిత్ శర్మ ఇంకా ఫైనల్ ఓటమి నుంచి బయటపడలేదని కొందరు సానుభూతి చూపిస్తున్నారు. ఏమైతేనేం టెస్ట్ సిరీస్ గెలుస్తారని అనుకుంటే, చెత్త రికార్డులను మనవాళ్లు మోసుకురావడం నిజంగా దురదృష్టకరమని చెప్పాలి.