T20 World Cup :మన అమ్మాయిలు అదరగొట్టారు. U-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో దుమ్మురేపారు. ఇంగ్లాండ్ ను ఫైనల్ లో చిత్తుగా ఓడించిన తొలిసారి భారత్ కు అండర్ -19 వరల్డ్ కప్ ట్రోఫిని అందించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్… ఇంగ్లాండ్ బ్యాటర్లను ప్రారంభం నుంచి కట్టడి చేసింది. మన బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు బ్యాట్లు ఎత్తేశారు. సాధు, అర్చనాదేవి, పర్షవి చోప్రా రెండేసి వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. వారికి మన్నత్ క్యాశప్ , షఫాలీ వర్మ, సోనమ్ తలో వికెట్ పడగొట్టి సహకారం అందించారు. దీంతో ఇంగ్లాండ్ 17.1 ఓవర్లలోనే 68 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ర్యానా మెక్ డొనాల్డ్ గే ఒక్కరే 19 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించింది. ఆ జట్టులో ఏడుగురు బ్యాటర్లు 4 పరుగులలోపే చేశారు.
69 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 పరుగులకే ఓపెనర్లు కెప్టెన్ షఫాలీ వర్మ ( 15 పరుగులు), శ్వేతా షెహ్రావత్ ( 5 పరుగులు) వికెట్లు కోల్పోయింది. అయితే వన్ డౌన్ బ్యాటర్ సౌమ్యా తివారీ (3 ఫోర్లతో 24 నాటౌట్) , తెలుగమ్మాయి గొంగడి త్రిష ( 24 పరుగులు)తో కలిసి భారత్ ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసింది. ఈ జోడి 46 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే విజయానికి 3 పరుగుల దూరంలో త్రిష అవుట్ అయ్యింది. కానీ సౌమ్యా తివారీ అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్ని అందించింది.
అండర్ -19 అమ్మాయిల విభాగంలో భారత్ తొలిసారిగా వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హన్నాహ్ బాకర్, గ్రేస్, అలెక్సా స్టోన్ హౌస్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో మరో 36 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.
4 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన సాధుకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నిలో 293 పరుగులు చేయడమేకాకుండా 9 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ గ్రేస్ స్క్రీవెన్స్ ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకుంది.