T20 వరల్డ్ కప్ లో ఘోర పరాజయంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా… న్యూజిలాండ్ పర్యటనలో అదరగొట్టింది. మూడు T20 మ్యాచ్ ల సిరీస్ ను 1-0 తేడాతో నెగ్గింది. వర్షం కారణంగా తొలి T20 రద్దు కాగా… రెండో T20లో 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది… టీమిండియా. మూడో T20కి కూడా వరుణుడు అడ్డుపడటంతో… డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టై అయినట్లు తేల్చారు. దాంతో… 1-0 తేడాతో సిరీస్ గెలిచింది… పాండ్యా సేన.
మూడో T20లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్… 160 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్, మార్క్ ఛాప్ మన్ విఫలమైనా… కాన్వే, ఫిలిప్ చెలరేగి ఆడి హాఫ్ సెంచరీలు చేయడంతో… కివీస్ భారీ స్కోరు చేస్తుందని అనిపించింది. 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 129 పరుగులతో పటిష్ట స్థితిలో కనిపించిన న్యూజిలాండ్… చివరి ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కుప్పకూలింది. 30 పరుగుల వ్యవధిలో ఏకంగా 8 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయగా… హర్షల్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.
161 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా… 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్ 10, రిషబ్ పంత్ 11 పరుగులు చేసి ఔట్ కాగా… శ్రేయస్ అయ్యర్ డకౌటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా జాగ్రత్తగా ఆడినా… ధాటిగా ఆడే ప్రయత్నంలో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర సూర్య కూడా ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 60 పరుగులు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడాతో కలిసి పాండ్యా భారీ షాట్లకు పోకుండా నిదానంగా ఆడారు. ఓ వైపు చిరుజల్లులు పడుతుండటంతో… ఏ క్షణమైనా మ్యాచ్ ఆగిపోవచ్చని, డక్ వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా విజయానికి ఒక పరుగు అటూ ఇటుగా ఉందని కామెంటేటర్లు చెబుతూ వచ్చారు. చివరికి వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 75 రన్స్ చేసింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సరిగ్గా 75 పరుగులు చేస్తే… మ్యాచ్ టై అవుతుంది. సరిగ్గా అదే స్కోరు దగ్గర టీమిండియా ఆగిపోయింది. ఒక్క రన్ తక్కువైనా పాండ్యా సేన ఓడిపోయేది… లేదా ఒక్క రన్ ఎక్కువైతే గెలిచేది. అలా కాకుండా సరిగ్గా మ్యాచ్ టై అయ్యే స్కోరు దగ్గరే టీమిండియా ఆగిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో… అంపైర్లు మ్యాచ్ టై అయినట్లు ప్రకటించారు. 1-0 తేడాతో టీమిండియా సిరీస్ గెలుచుకుంది.