India Vs West Indies : తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ సత్తాచాటింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులో బ్రెండన్ కింగ్ (42), కెప్టెన్ పావెల్ (40 నాటౌట్ ) మెరుపులు మెరిపించారు. మేయర్ (25), పూరన్ (20) పర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో కులదీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ , ముఖేశ్ కుమార్ తలో వికెట్ తీశారు.
160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్ నాలుగో బంతికే అరంగేట్రం ఆటగాడు యశస్వి జైశ్వాల్ (1) వికెట్ కోల్పోయింది. వన్ డౌన్ క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ తొలి రెండు బంతులకు ఫోర్ , సిక్సు కొట్టి తన ఉద్దేశాన్ని చాటిచెప్పాడు. సూర్య దూకుడుగా ఆడుతున్నా.. మరోవైపు క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బంది పడి గిల్ (6) అవుట్ అయ్యాడు. అప్పటి నుంచే గేమ్ స్వరూపం మారిపోయింది. సూర్యకు జతకలిసిన తిలక్ వర్మ (49 నాటౌట్, 37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సు) దూకుడుగా ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. తానాడిన తొలి రెండు బంతులను బౌండరీకి పంపాడు. ఈ జోడి మూడో వికెట్ కు 87 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేసింది.
సూర్య (83, 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులు) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (20 నాటౌట్ ) సిక్సుతో భారత్ కు విజయాన్ని అందించాడు. టీమిండియా 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు, మెకాయ్ ఒక వికెట్ తీశారు. బ్యాటింగ్ లో అదరగొట్టిన సూర్యకుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నాలుగో టీ20 మ్యాచ్ ఆగస్టు 12న జరుగుతుంది.