Ind-Aus 3rd ODI: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో నేడు చివరిదైన మూడో వన్డేలో భారత్జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత మహిళల జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. చివరి మ్యాచ్తో అయినా కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో ఇవాళ బరిలోకి దిగుతోంది హర్మన్ప్రీత్ సేన.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో రాణించి అద్భుత విజయాలు సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే ఫార్మాట్లో మాత్రం చతికిలపడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ ఫైనల్ రిజల్ట్ పై పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం జట్టుకు ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారతజట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైనా.. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చివరిసారి 2007లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్ లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా 9 వన్డేల్లో ఓటమిని చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయ పరంపరకు తెరదించాలంటే చివరి వన్డేలో భారతజట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెప్టెన్ హర్మ న్ప్రీత్ కూడా బ్యాటింగ్లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్లో రేణుక సింగ్తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్ఫీల్డ్, తాలియా మెక్గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెప్టెన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే.. వన్డే సిరీస్ను ఆ్రస్టేలియా క్లీన్స్వీప్ చేయడం ఖాయమే.
.
.