India Vs West Indies : డొమినికాలో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ను 150 పరుగులకే కుప్పకూల్చి భారత్ బౌలర్లు సత్తా చాటారు. బ్యాటర్లు అదే జోరును కొనసాగిస్తూ భారీ స్కోర్ దిశగా తీసుకెళుతున్నారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో కదం తొక్కారు. తొలి వికెట్ కు 229 పరుగులు జోడించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆసియాకు బయట భారత్ కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం . 1979లో చేతన్ చౌహాన్-గవాస్కర్ జోడి ఇంగ్లాండ్పై 213 పరుగులు చేసి నెలకొల్పిన రికార్డును రోహిత్-జైస్వాల్ జంట తిరగ రాసింది.
ఈ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన జైస్వాల్ కొత్త రికార్డులు సృష్టించాడు. తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన 17 భారత్ బ్యాటర్ గా నిలిచాడు. అంతేకాదు ఈ ఘనత అందుకున్న మూడో ఓపెనర్ గా రికార్డు నెలకొల్పాడు. గతంలో శిఖర్ ధావన్, పృథ్వీ షా ఓపెనర్లగా బరిలోకి దిగి తొలి టెస్టులోనే సెంచరీలు కొట్టారు. 350 బంతులను ఎదుర్కొని 14 ఫోర్లతో 143 పరుగులు చేసి క్రీజులో ఉన్న జైస్వాల్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్రం టెస్టులో అత్యధిక బంతులాడిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.
80 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండోరోజు ఆటను అదే జోరుతో టీమిండియా కొనసాగించింది. రోహిత్ శర్మ 103 పరుగుల చేసి టెస్టుల్లో 10 సెంచరీ సాధించాడు. రోహిత్ పెవిలియన్ కు చేరిన తర్వాత శుభ్ మన్ గిల్ 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లి మాత్రం సహనంతో బ్యాటింగ్ చేస్తూ 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో రెండోరోజు ఆటముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 312 పరుగులు చేసింది. ఇప్పటికే 162 పరుగుల ఆధిక్యం సాధించింది. విండీస్ బౌలర్లలో వర్రీకన్, అథనేజ్ తలో వికెట్ తీశారు.