U19 World Cup 2024 : అండర్ 19 క్రికెట్ లో యువభారత్ అదరగొడుతోంది. గ్రూప్ మ్యాచ్ లో ఆఖరిదైన మూడోది కూడా విజయం సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అర్షిన్ కులకర్ణి (108) సెంచరీ సాధించాడు. ముషీర్ ఖాన్ (73) తోడు కావడంతో భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన యూఎస్ఏ జట్టు 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 201 పరుగుల భారీ తేడాతో యువ భారత్ ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (25) చేసి అవుట్ అయ్యాడు. తర్వాత రెండో వన్డేలో సెంచరీ చేసిన ముషీర్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. అర్షిన్ కులకర్ణితో కలిసి రెండో వికెట్ కు 155 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నిర్మించాడు. తను కూడా సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ 73 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
అనంతరం అర్షిన్ తన బ్యాటింగ్ కొనసాగించాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ (35) సహకారంతో సెంచరీ చేసి 108 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత ప్రియాన్షు (27), సచిన్ దాస్ (20) చేశారు. అరవెల్లి అవనీశ్ (12 నాటౌట్) గా నిలిచాడు. మొత్తానికి 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
యూఎస్ఎ బౌలింగ్ లో ఆర్య గర్గ్ 1, అతీంద్ర సుబ్రహ్మణ్యన్ 2, ఆరిన్ సుశీల్ నాదకర్ణి 1, రిషి రమేష్ 1 వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన యూఎస్ ఏ జట్టులో ఓపెనర్లు ఇద్దరూ నిరాశపరిచారు. ప్రణవ్ (2), భవ్య మెహతా డక్ అవుట్ అయ్యాడు. తర్వాత సిద్ధార్థ కప్ప (18), ఉత్కర్ష్ శ్రీ వాత్సవ (40), అమోగ్ రెడ్డి ఆరేపల్లి (27), సుశీల్ నాదకర్ణి (20) తప్ప పెద్దగా ఎవరూ ఆడలేదు.
మొత్తానికి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేశారు.
టీమ్ ఇండియా బౌలింగ్ లో నమన్ తివారి 4, రాజ్ లింబాని 1, సౌమ్య్ కుమార్ పాండే 1, మురుగన్ 1, ప్రియాన్షు 1 వికెట్ పడగొట్టారు. ఈసారి మ్యాచ్ లో మొత్తం 8 మంది బౌలింగ్ చేయడం విశేషం. ఆఖరికి కెప్టెన్ ఉదయ్ సహరన్ కూడా 2 ఓవర్లు వేశాడు.