India vs Sri Lanka 3rd T20I Dream11 Prediction: శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ నేడు పల్లెకెలే మైదానంలో జరగనుంది. ఇప్పటికే రెండు టీ 20లు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా మూడోది కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. కనీసం ఇదొక్కటైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక చూస్తోంది. మొత్తానికి మ్యాచ్ నేటి రాత్రి 7 గంటలకు డిస్నీహాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
శ్రీలంక ఓడిపోతున్నా సరే, వారి పోరాట పటిమ ఆకట్టుకుంటోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రెండు జట్లు పైకి సమఉజ్జీలుగా కనిపిస్తున్నా భారత్ దే పై చేయి అయింది. భారత్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ పరంగా సత్తా చాటడంతో రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించింది.
ఓపెనర్ సంజూ శాంసన్ పరిస్థితి టీమ్ ఇండియా శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడిన సంజూ సరిగ్గా జాతీయ జట్టులోకి వచ్చేసరికి తేలిపోతున్నాడు. ఇలా చాలాసార్లు జరిగింది. లేదంటే ఈపాటికి విరాట్, రోహిత్ శర్మ లాంటి వాళ్లతో సమాన స్థాయిలో ఉండేవాడు. జట్టులో స్థిరమైన ఆటగాడిలా ఉండేవాడు. కానీ ఎందుకో తను జాతీయ జట్టులో ఇమడలేకపోతున్నాడు.
మరి మూడో టీ 20లో సంజూకి మరో అవకాశం గంభీర్ ఇస్తాడా? లేదంటే…ఆఖరి అవకాశం ఇచ్చి, విఫలమైతే ఇక సంజూకి టీ 20లో తలుపులు మూసేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మహ్మద్ సిరాజ్ కూడా బౌలింగు బాగానే చేస్తున్నాడు కానీ వికెట్లు రావడం లేదు. స్కోరు మాత్రం కంట్రోల్ చేస్తున్నాడు. ఇదొక్కటే ఆశావాహ పరిణామంగా ఉంది. మరోవైపు సిరాజ్ ని పక్కనపెట్టి గంభీర్ కోరి తెచ్చుకున్న ఖలీల్ అహ్మద్ కి అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది.
Also Read: ఒలింపిక్స్ లో నేటి భారత షెడ్యూల్ ..
ఈ రెండు మార్పులు తప్ప పెద్దగా ఉండకపోవచ్చునని అంటున్నారు. రియాన్ పరాగ్ కీలక ఆల్ రౌండర్ లా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తను యువరాజ్ సింగ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు శ్రీలంక పరంగా చూస్తే కెప్టెన్ చరిత్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. రెండు మ్యాచ్ ల్లో తేలిపోయాడు. మరి నేటి మ్యాచ్ లోనైనా ఆకట్టుకుని కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, జట్టుని గెలిపించాలని శ్రీలంక అభిమానులు కోరుకుంటున్నారు. బోర్డు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయడని వారు చెబుతున్నారు. మరి నేటి మ్యాచ్ లో ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.