India vs South Africa : ఎన్నో సంచలనాలకు వేదికగా మారిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక సగర్వంగా ఇండియా ఫ్లయిట్ ఎక్కనుంది. మూడు సిరీస్ ల్లో (టీ20, వన్డే, టెస్టు) ఒక్కటీ కూడా ఓడిపోకుండా ఇండియా తిరిగి రావడం ఇదే మొదటిసారి. ఈ రికార్డు సాధించి చరిత్ర సృష్టించింది.
12 ఓవర్లలోనే అంటే అతి తక్కువ ఓవర్లలో విజయం సాధించిన జట్టుగా టీమ్ ఇండియా నయా చరిత్ర చరిత్ర సృష్టించింది. ఐదురోజుల టెస్ట్ మ్యాచ్ కేవలం రెండురోజుల్లోనే అయిపోవడం, అభిమానులకు నచ్చకపోయినా, కావల్సినంత మజాను మాత్రం అందించింది.
మొదటి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 55 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 153 పరుగులు చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అలా టీమ్ ఇండియాకు 79 టార్గెట్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ లో 79 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా టీ20 తరహాలోనే ప్రారంభించింది. ఎక్కడా డిఫెన్స్ అన్న మాటకు తావులేకుండా ధనాధన్ ఆడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ చాలా కసిగా, దూకుడుగా ఆడాడు. 23 బాల్స్ ఆడి, 6 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ షాట్ కొట్టేటప్పుడు గిర్రుమని తిరిగి వికెట్ల మీద పడబోయి, తృటిలో తప్పించుకున్నాడు. అయితే బ్యాట్ వికెట్లకు తగిలిందికానీ, బేల్స్ కిందకు పడలేదు. దీంతో హమ్మయ్యా బతికాడురా అనుకున్నారు. కానీ అక్కడ లాంగ్ ఆన్ లో క్యాచ్ అవుట్ అయి వెనుతిరిగాడు. అవుట్ అయితే అయ్యాడు గానీ టెన్షన్ తగ్గించాడు.
తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్ కూడా ఎటాకింగ్ ప్లే ఆడాడు. 11 బాల్స్ లో 2 ఫోర్లు కొట్టి 10 రన్స్ చేసి రబాడా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఈసారి కెప్టెన్ రోహిత్ శర్మ కొంచెం సంయమనం పాటించాడు. కానీ అదికూడా కొద్దిసేపే. లక్ష్యానికి దగ్గరగా వచ్చిన సమయంలో రబడా బౌలింగ్ లో షాట్ కొట్టాడు. కానీ చాలా హైట్ వెళ్లడంతో సౌతాఫ్రికా ఫీల్డర్ క్యాచ్ వదిలేశాడు. తను మాత్రం 22 బాల్స్ ఆడి 2 ఫోర్ల సాయంతో 17 పరుగులు చేశాడు.
గిల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన కోహ్లీ కూడా దూకుడుగానే ఆడాడు. 11 బాల్స్ ఆడి రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేశాడు. లక్ష్యానికి 4 పరుగుల దూరంలో, మార్కో జాన్సన్ వేసిన బంతి గ్లవ్స్ కి తగిలి కీపర్ చేతిలోకి వెళ్లింది. అయితే అంపైర్ అవుట్ ఇవ్వలేదు. కానీ సౌతాఫ్రికా కెప్టెన్ డీఆర్ఎస్ కోరాడు. దాంతో అవుట్ గా తేలి, నవ్వుతూ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఫోర్ కొట్టి టీమ్ ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు.