IND VS SA 1st ODI: సౌతాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ ను 1-1తో ముగించిన టీమిండియా వన్డే ఫార్మాట్ ఆడేందుకు సిద్ధమైంది. సిరీస్లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. టెస్ట్ సిరీస్ నేపథ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ సిరీస్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పర్యవేక్షణలో రాహుల్ సేన ఈ వన్డే సిరీస్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
జోహన్నెస్ బర్గ్ వేదికగా ఈ రోజు జరిగే తొలి మ్యాచ్తో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సంజూశాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్లో తెలుగు తేజం తిలక్ వర్మ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నారు. చాలా రోజుల తర్వాత టీమిండియా పిలుపును అందుకున్న వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్.. ఈ సిరీస్తో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సంజూతో పాటు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వన్డే సిరీస్కు ఎంపికయ్యారు.
ఐదో స్థానంలో వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఆరో స్థానంలో నయా హిట్టర్ రింకూ సింగ్ ఆడనుండగా.. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. యుజ్వేంద్ర చాహల్ను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టాల్సి ఉంటుంది. కానీ చివరి టీ20లో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.