India vs England Test Series 2024(sports news in telugu): ఇంగ్లాండ్ వస్తూనే బజ్ బాల్ వ్యూహం అంటూ ఇండియాలో అడుగుపెట్టింది. అంతకు ముందు దుబాయ్ లో ప్రాక్టీస్ చేసింది. తర్వాత మధ్యలో ఎక్కువ గ్యాప్ రావడంతో మళ్లీ దుబాయ్ వెళ్లి అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చింది.
టెస్ట్ మ్యాచ్ ని కూడా టీ 20 తరహాలోనే ఆడి, వాటికి ఒక కలరింగ్ తీసుకొచ్చింది. కాకపోతే ఆ వ్యూహంపై పలు విమర్శలు వినిపించాయి. అయితే ఇంత చేసిన ఇంగ్లాండ్ సిరీస్ లో కొట్టిన సిక్సర్లు ఎన్నంటే 29 ఉన్నాయి. అసలు బజ్ బాల్ అంటేనే ఏమీ తెలీదు. నేనా స్కూల్ లో చదవలేదని చెప్పిన రోహిత్ సేన కొట్టిన సిక్సులు ఎన్నంటే 73 ఉన్నాయి.
ఇలా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఈ సిక్సర్లతో ఒక అరుదైన రికార్డు సృష్టించాయి. అదేమిటంటే ఒక టెస్టు సిరీస్ లో ఇరు జట్లు కలిపి 100 సిక్సర్లు కొట్టిన తొలి సిరీస్ గా రికార్డులకెక్కింది. మొత్తమ్మీద 102 సిక్సర్లు ఇరుజట్ల ఆటగాళ్లు కొట్టారు. అందులో టీమ్ ఇండియా ఓపెనర్, చిచ్చర పిడుగు యశస్వి జైశ్వాల్ కొట్టినవి 26 ఉన్నాయి.
అంతకుముందు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ యాషెస్ టెస్టు సిరీస్ ఉండేది. 2023 జరిగిన ఆ సిరీస్ లో ఇరుజట్లు 74 సిక్సర్లు కొట్టారు. బజ్ బాల్ వ్యూహం అంటూ ఇంగ్లాండు వచ్చింది కానీ ఇండియా కూడా అదే రీతిలో ఆడింది. హడావుడి చేసింది. నిజానికి ధర్మశాలలో టెస్ట్ మ్యాచ్ మూడురోజుల్లోనే ముగిసిపోయింది. మరిలా బజ్ బాల్ తరహాలో ఆడితే టెస్ట్ మ్యాచ్ లపై ఆసక్తి ఉండదని అంటున్నారు. కొన్ని రోజులకి 5 రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్తా మూడురోజులకు మారినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
అప్పుడు మూడు రోజులు రెండు ఇన్నింగ్స్ అంటే ఇంక చూసుకోనవసరం లేదని చెబుతున్నారు. అలాంటి మ్యాచ్ లకి ఆదరణ కూడా పెరుగుతుందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.