Ind vs Eng 3rd Test Latest update : ఇంగ్లాండ్-ఇండియా మధ్య మూడో టెస్ట్ రేపు రాజ్ కోట్ లో ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. అయితే సిరీస్ మొదలైన దగ్గర నుంచి టీమ్ ఇండియాకి కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా టీమ్ ఇండియాలో కీలక ఆటగాళ్లు ఒకొక్కరు తప్పుకుంటున్నారు. ఇది టీమ్ ఇండియాకి పెనుభారంగా మారింది.
ప్రస్తుతం జట్టులో విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లేరు. మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా ఎప్పుడు వస్తారో తెలీదు. ఇలా చూస్తూ జట్టులో సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, అశ్విన్ ముగ్గురే కనిపిస్తున్నారు. బ్యాటర్లలో రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి, అర్జంట్ పని ఉన్నట్టు పెవిలియన్ కి వెళ్లిపోతున్నాడు.
కొహ్లీలా క్రీజులో ఉండి, యువ బ్యాటర్లను ముందుకు నడిపించే వారు లేక విలవిల్లాడుతోంది. దీంతో కుర్రాళ్లు అనుభవరాహిత్యంతో చేజేతులారా వికెట్లు పారేసుకుంటున్నారు. ఎట్టకేలకు శుభ్ మన్ గిల్ ఫామ్ లోకి వచ్చాడు. రోహిత్ శర్మ ఇంకా జూలు విదల్చలేదు. రెండు టెస్టుల్లో నిరాశపరిచాడు.
యశస్వి జైశ్వాల్ ఒక్కడి మీదే ఆశలున్నాయి. తనొక్కడు మాత్రం ప్రతి టెస్టులో ఎలా ఆడతాడనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ బౌలర్లు తన వీక్ నెస్ ని బాగా స్టడీ చేసి ఉంటారు. తననే టార్గెట్ చేస్తూ బౌలింగ్ అటాక్ చేయవచ్చు. మనవాళ్లు పోప్ ని అటాక్ చేస్తున్నట్టుగానే వాళ్లూ యశస్విని చేస్తారు. అందువల్ల తనింకా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.
ఇప్పుడు రజత్ పటీదార్ రెండో టెస్ట్ లో ఆరంగ్రేటం చేశాడు. తనకి అవకాశాలివ్వాలి. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ఆరంగ్రేటం చేసేలా ఉన్నాడు. సెకండ్ డౌన్ లో వస్తాడని అంటున్నారు. రంజీల్లో సెంచరీల మోత మోగిస్తున్న దేవ్దత్ పడిక్కల్ కూడా జట్టులోకి వచ్చాడు. చివరి 11 మందిలో తనుంటాడా? లేదా? అనేది సందేహంగానే ఉంది.
ఇలా చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి, గిల్, రజత్ , సర్ఫరాజ్ / దేవదత్ టాప్ ఆర్డర్ లో కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి వికెట్ కీపర్ పాత్ర మొదలవుతుంది. ఆంధ్రా ఆటగాడు కేఎస్ భరత్ పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆకట్టుకున్నా, రెండో టెస్ట్ లో తేలిపోయాడు. ప్రధాన ఆటగాళ్లే ఆడటం లేదు, వారిపై చర్యల్లేవు కానీ, భరత్ ని బలిచేస్తారా? అని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.
బహుశా తన ప్లేస్ లో ధృవ్ జురెల్ ఆరంగ్రేటం చేయవచ్చునని అంటున్నారు. ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ ఉంటాడు. స్పిన్నర్లలో అశ్విన్ ఉండనే ఉన్నాడు. తనకి తోడుగా రెండో టెస్ట్ లో ఆకట్టుకున్న కులదీప్ ఉంటాడు. పేసర్ బుమ్రాకి సపోర్ట్ ఇచ్చే వారే కరవయ్యారు. రెండో టెస్ట్ నుంచి తప్పించిన మహ్మద్ సిరాజ్ మళ్లీ వచ్చేలా కనిపిస్తున్నాడు.
మరి కొత్తవారితో తళతళమని మెరుస్తున్న టీమ్ ఇండియా టెస్ట్ జట్టు ఇంగ్లాండ్ ని ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే.
11 మంది జట్టు ఇలా ఉండవచ్చు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, ధృవ్ జురెల్ /కేఎల్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.