India Cricket Team News : విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్ లో టీమ్ ఇండియా అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాదు, అంతకన్నా అద్భుతంగా క్యాచ్ లు కూడా పట్టారు. దురదృష్టం ఏమిటంటే, అంతకన్నా ఎక్కువగా క్యాచ్ లు మిస్ చేశారు. సాక్షాత్తూ కెప్టెన్ రోహిత్ శర్మ మిస్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ క్యాచ్ ను స్లిప్ లో వదిలేశాడు. చేతిలోకి పండులా వచ్చిందాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యాడు.
ఆ తర్వాత బెన్ స్టోక్ బ్రహ్మాండమైన సిక్స్ కొట్టాడు. ఇప్పుడా క్యాచ్ వదిలేయడం… జట్టుపై ఎంతటి ప్రభావం చూపిస్తోందోనని నెట్టింట అభిమానులు కంగారుపడ్డారు. కానీ 47 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో హమ్మయ్యా అనుకున్నారు.
మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ ఎవరిదంటే శ్రేయాస్ అయ్యర్ పట్టిందనే చెప్పాలి. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ అద్భుతంగా ఆడుతున్నాడు. టెస్ట్ మ్యాచ్ ని వన్డే తరహాలో ఆడటం మొదలుపెట్టాడు. బహుశా బజ్ బాల్ వ్యూహం అమలు చేస్తున్నాడని అంతా అనుకున్నారు. తనని అవుట్ చేయడం ఎవరి వల్లా కాలేదు. కాకపోతే గిల్ ఒకసారి కష్టమైన క్యాచ్ ని విడిచి పెట్టాడు. దీంతో బతికిపోయిన జాక్ తర్వాత రెచ్చిపోయాడు.
ఈ సమయంలో అక్షర్ పటేల్ వేసిన 23వ ఓవర్లో ఒక అద్భుతం చోటు చేసుకుంది. మూడో బంతిని ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ లైన్పై అక్షర్ వేశాడు. అయితే దానిని జాక్ క్రాలీ భారీ షాట్ కొట్టాడు. దీంతో బంతి గాల్లోకి లేచింది.. అయితే బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ పరుగెత్తి, పరుగెత్తి డైవ్ చేసి మరీ క్యాచ్ ని అందుకున్నాడు.
మొత్తానికి జాక్ క్రాలీ (78 బంతుల్లో 76) చేసి, శ్రేయాస్ పట్టిన అద్భుత క్యాచ్ ను ఆశ్చర్యంగా చూస్తూ నిరాశగా పెవిలియన్ చేరాడు.
బ్యాటింగ్ లో విఫలమైన గిల్, ఫీల్డింగ్ లో మాత్రం నాలుగు చక్కని క్యాచ్ లు అందుకున్నాడు. టీమ్ ఇండియాకి మ్యాచ్ పై పట్టు చిక్కేలా చేశాడు.