India vs England 1st Test : రెండో రోజు కూడా మ్యాచ్ లో టీమ్ ఇండియాదే ఆధిపత్యం కనిపించింది. రవీంద్ర జడేజా అద్భుతమైన పోరాటపటిమతో టీమ్ ఇండియా పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుతం 81 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఒక్క అశ్విన్ తప్ప ఓపెనర్ల దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఎన్నో కొన్ని పరుగులు చేయడంతో భారత్ పటిష్టస్థితికి చేరుకుంది. అశ్విన్ కూడా దురదృష్టవశాత్తూ రన్ అవుట్ అయ్యాడు.
మొత్తానికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. అలా ఇంగ్లాండ్ పై 175 పరుగుల ఆధిక్యం లభించింది. ఒక వికెట్ నష్టానికి రెండోరోజు ఉదయం 119 పరుగులతో ఆట మొదలుపెట్టిన టీమ్ ఇండియా వెంటవెంటనే యశస్వి (80), శుభ్ మన్ గిల్ (23) వికెట్లను కోల్పోయింది. సెంచరీ చేస్తాడనుకున్న యశస్వి కేవలం మొదటిరోజు స్కోరుకి 4 పరుగులు మాత్రమే జోడించి అవుట్ అయ్యాడు.
తర్వాత గిల్ క్రీజులో నిలదొక్కుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. 23 పరుగులు చేయడానికి 66 బంతులు తీసుకున్నాడు. కేవలం 2 ఫోర్లు మాత్రమే అందులో ఉన్నాయి. ఎట్టకేలకు ఇండియా స్కోరు 159 పరుగుల వద్ద మూడో వికెట్ గా వెనుతిరిగాడు.
తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ మళ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తను కూడా సెంచరీ చేసినట్టే కనిపించాడు. 86 పరుగుల వద్ద దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాడు. అందులో 2 సిక్స్ లు, 8 ఫోర్లు ఉన్నాయి. తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. నిజానికి తను కుదురుకున్నాడంటే, తనని అవుట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈసారి మాత్రం 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అప్పుడొచ్చాడు రెండో రోజు హీరో, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. రావడం, రావడమే ధనాధన్ ఆడాడు. సిక్స్ కొట్టాడు, ఫోర్లు కొట్టాడు. తర్వాత నెమ్మదించాడు. ఆఫ్ సెంచరీ చేసి తన మార్క్ విన్యాసంతో స్టేడియంలో సందడి చేశాడు. చివరికి ఆట ముగిసే సమయానికి 81 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
తెలుగు ఆటగాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్ (41) తను బ్యాటింగ్ లో ప్రూవ్ చేసుకున్నాడు. మొదట్లో జాగ్రత్తగా ఆడాడు. క్రీజులో కుదురుకున్నాక మంచి షాట్లు కొట్టాడు. ఇలాగే ఆడితే భవిష్యత్ కీపర్ గా రాణించే అవకాశాలున్నాయని సీనియర్లు వ్యాఖ్యా నించారు.
రవిచంద్రన్ అశ్విన్ ఒక పరుగు మాత్రమే చేశాడు. అనూహ్యంగా రన్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ అదరగొట్టాడు. రెండో రోజు ఆట ఆఖరి ఓవర్ లో ఒక సిక్స్ , రెండు ఫోర్లు కొట్టి ఘనంగా ఆటను ముగించాడు. తను 35 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఇప్పుడు జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ మూడోరోజు ఎలా ఆడతారు? ఎంతవరకు తీసుకువెళతారు? అనే దానిపై భారత్ జట్టు స్కోరు ఆధారపడి ఉంది. వీరి తర్వాత బుమ్రా, సిరాజ్ ఉన్నారు. ఎలాగైతేనేం 175 పరుగుల ఆధిక్యంతో టీమ్ ఇండియా ముందడుగు వేసింది. కనీసం 250 నుంచి 300 పరుగల టార్గెట్ ఇస్తే, ఇంగ్లాండ్ ని ఆలౌట్ చేయవచ్చునని అంటున్నారు.
మొత్తానికి తొలిరోజు నాలుగు పార్టనర్ షిప్ లు బ్రహ్మాండంగా సాగాయి. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, తర్వాత రాహుల్-జడేజా, మూడో పార్టనర్ షిప్ జడేజా-కేఎస్ భరత్, ఇంక ఆఖరున జడేజా-అక్షర్ పటేల్ భాగస్వామ్యాలు టీమ్ ఇండియా పటిష్ట స్థితికి కారణమయ్యాయి.
ఇంగ్లాండ్ బౌలింగ్ లో టామ్ హార్ట్ లీ 2, జోరూట్ 2, జాక్ లీచ్ 1, రెహన్ అహ్మద్ 1 వికెట్టు పడగొట్టారు.