India vs Bangladesh match : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పుణెలో జరిగిన బంగ్లాదేశ్-ఇండియా మధ్య మ్యాచ్ చూస్తుంటే హై ఓల్టేజ్ మ్యాచ్ లా అనిపించింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ దగ్గర నుంచి చూస్తే.. ఇదేదో కొంప మునిగేలాగే ఉందని అనిపించింది. ఒక్కసారి పైకెళ్లడం..మళ్లీ కిందపడటం..మళ్లీ పైకెళ్లడం.. మళ్లీ కిందపడటం..మ్యాచ్ చూస్తున్నంత సేపు కోట్లాదిమంది క్రికెట్ అభిమానుల బీపీ అలాగే పెరిగింది.. మళ్లీ తగ్గింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 256 పరుగులు అంటే కొంచెం మంచి టార్గెట్ ఇచ్చారు. నిజంగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే మాత్రం ప్రత్యర్థులను కట్టడి చేయగలిగే స్కోరే అది…కాకపోతే మనవాళ్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ ఇద్దరూ మొదటి బాల్ నుంచి ఎడాపెడా వాయించడం మొదలుపెట్టారు. దీంతో 41.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఇండియా లక్ష్యాన్ని చేధించింది. ఈ మధ్యలో కింగ్ కొహ్లీ తనకెంతో ఇష్టమైన ఛేజింగ్ లో సెంచరీ చేసి, భారత అభిమానులకు మరో గుర్తుండిపోయే మ్యాచ్ ని ఇచ్చాడు.