India vs Bangladesh : ఇండియా బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉందంటే..వీరిని అవుట్ చేయడం అంత ఆషామాషీ యవ్వారం కాదన్నట్టుగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ సాగింది. వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా పుణెలో జరిగిన ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ లో మనోళ్లు ఇరగ్గొట్టి వదిలారు. కింగ్ కొహ్లీ సెంచరీ (103) తో కదం తొక్కాడు. దీంతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అందుకు బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 3 వికెట్లు మాత్రం నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో కొహ్లీది ఒక క్లాసికల్ సెంచరీ అని చెప్పాలి.
బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హాసన్ , లిటన్ దాస్ ఇద్దరూ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. మొదట మూడు ఓవర్లలో అయితే కేవలం 6 పరుగులు మాత్రమే చేశారంటే, వికెట్లు కాపాడుకుంటూ వాళ్లెంత జాగ్రత్తగా ఆడారనేది అర్థమవుతోంది.
తర్వాత సీన్ కట్ చేస్తే 14.4 ఓవర్ లో హాసన్ (51) వికెట్ పడింది. అప్పటికి స్కోర్ 93 పరుగులు. ఆ సమయానికి బంగ్లా చాలా పటిష్టంగా కనిపించింది. వీళ్ల ఊపు చూస్తుంటే 300 పరుగులు దాటుతుందనే అంతా అనుకున్నారు. కానీ కుల్ దీప్ తొలి వికెట్ తీసి ఇండియాని ఒత్తిడిలోంచి బయటకు తీసుకొచ్చాడు.
18 ఓవర్ లో రవీంద్ర జడేజాకు రోహిత్ శర్మ బాల్ అప్పగించాడు. తనకి అప్పగించిన పనిని జడ్డూ సమర్థవంతంగా పూర్తి చేశాడు. రెండు ఓవర్లలో రెండు వికెట్లు ఠపీఠపీ మని తీశాడు. వీటి మధ్యలో సిరాజ్ కి ఒక వికెట్ దక్కింది. ఇలా 27.4 ఓవర్లు దగ్గరికి వచ్చేసరికి బంగ్లాదేశ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (66), మిరాజ్ (3), సజ్ముల్ శాంటో( 2) వికెట్లు పడ్డాయి.
ఇక ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ నెమ్మదిగా ఒక పథకం ప్రకారం ఆడటం మొదలుపెట్టింది. 37.2 ఓవర్ల వరకు మరో వికెట్ పడలేదు. అప్పటికి 181 పరుగులతో బంగ్లాదేశ్ మళ్లీ స్ట్రాంగ్ గా కనిపించింది. ఆ దశలో శార్దూల్ ఠాకూర్ కి తొలి వికెట్ లభించింది. తౌహిద్ హ్రదోయ్ (16) ఐదో వికెట్ గా వెనుతిరిగాడు. మళ్లీ 43 ఓవర్ లో బూమ్రా బౌలింగ్ లో జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టేశాడు.అలా ముష్ఫీకర్ (38) అవుట్ అయ్యాడు. దీంతో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఉంది. చివరికి మరో రెండు వికెట్లు కోల్పోయి 50 ఓవర్లకు 256 పరుగుల వద్ద బంగ్లాదేశ్ పోరాటం ముగిసింది.
తర్వాత ఇండియా ఛేజింగ్ ప్రారంభమైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ వీళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించారు. మొదటి బాల్ నుంచే దంచికొట్టడం మొదలుపెట్టారు. హిట్ మ్యాన్ రోహిత్ అయితే దొరికిన దాన్ని దొరికినట్టు ఫోర్లు, సిక్సర్లు కింద కొట్టాడు. పెద్దోడు ఒకవైపు నుంచి రెచ్చిపోతుంటే, చిన్నోడు గిల్ ఊరుకుంటాడా? తను ఫోర్లు మీద ఫోర్లు సిక్సులు కొడుతూ స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. అలా బౌలర్లపై ఆధిపత్యం కొనసాగించారు.
సరిగ్గా 13 ఓవర్ లో హాసన్ మహ్మద్ బౌలింగ్ లో రోహిత్ శర్మ (48) భారీ షాట్ కొట్టి తౌహిద్ కి క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి ఇండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు. అప్పుడు క్రీజులోకి వచ్చాడండి
కింగ్ కొహ్లీ..రావడం రావడమే రెండు ఫ్రీ హిట్లు వచ్చాయి. ఒకటి ఫోర్, ఒకటి సిక్స్ బాది పరుగుల వేట మొదలుపెట్టాడు. మళ్లీ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. 20 ఓవర్ వచ్చింది..శుభ్ మన్ గిల్ (53) అవుట్ అయ్యాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.
తను కాన్ఫిడెంట్ గానే కనిపించాడు. కానీ 19 పరుగులు చేసి భారీ సిక్స్ కోసం ట్రై చేసి మెహదీ హాసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పుడు మళ్లీ మిస్టర్ డిపెండబుల్ గా పేరుపొందిన కేఎల్ రాహుల్ ఎంటరయ్యాడు. ఇక తనతో కలిసి కొహ్లీ ఇన్నింగ్స్ ను సింగిల్స్ తో నిర్మించిన తీరు, ఎక్కడా కంగారుపడకుండా, టెంప్ట్ అవకుండా మ్యాచ్ ని గెలిపించిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. ఈ క్రమంలో వన్డేల్లో తన 48వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.
ఆ సెంచరీ కోసం అటు ఎండ్ లో రాహుల్ ని ఆపి, తను రన్స్ చేసిన తీరుపై అంతా ప్రశంసలు కురిపించారు. ఎందుకంటే ఆస్ట్రేలియాపై మ్యాచ్ లో కూడా 85 పరుగులు చేసి సెంచరీ ముందు అవుట్ అయిపోయాడు. ఇప్పుడా పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఆడి..ఆటను సంపూర్ణం చేశాడు. మొత్తానికి మూడు వికెట్ల నష్టానికి ఇండియా లక్ష్యాన్ని చేధించింది. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. రన్ రేట్ ప్రకారం న్యూజిలాండ్ జట్టు ఇండియాకన్నా ముందుంది.
ఇలాగే అన్ని మ్యాచ్ లు గెలిచి, ఇండియా వరల్డ్ కప్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ఇండియా వరుస గెలుపులతో అప్పుడే అభిమానుల్లో హీట్ పెరిగిపోయింది. మున్ముందు ఇంకెలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.