U19 World Cup 2024 : టీమ్ ఇండియా కుర్రాళ్లు తొలి మ్యాచ్ లోనే బంగ్లాదేశ్ పై విజయం సాధించి, అండర్ 19 వరల్డ్ కప్ లో బోణీ కట్టారు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మెగా టోర్నమెంట్ లో శనివారం గ్రూప్-ఏలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో 84 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తడబడింది. 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఇండియా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 96 బంతుల్లో 76 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ ఆర్షిన్ కులకర్ణి 7 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత ఫస్ట్ డౌన్ ముషీర్ ఖాన్ (3) చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ ఉదయ్ సహరన్ 94 బంతుల్లో 64 రన్స్ చేశాడు.
మిగిలిన బ్యాటర్లలో సచిన్ దాస్ (26), ప్రియన్షు మోలియా (23), అరవెల్లి అవనీష్ (23) రెండంకెల స్కోరు చేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ ఇద్దరూ బాధ్యతగా ఆడటంతో యువ భారత్ 7 వికెట్ల నష్టానికి 50 ఓవర్లలో 251 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో మరుఫ్ మ్రిదా 5 వికెట్లతో సత్తాచాటాడు. ఎండీ రిజ్వాన్ 1, రహ్మాన్ రాబీ 1 వికెట్ తీశారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ షిహాద్ జేమ్స్ (54), ఆరిఫుల్ ఇస్లాం (41) మినహా మిగిలిన బ్యాటర్లు రాణించలేదు. ఓపెనర్లు ఇద్దరూ ఆషిఖర్ రెహ్మాన్ (14), జిషాన్ (14) చేసి అవుట్ అయ్యారు. తర్వాత షేక్ పర్విజ్ (15) చేశాడు. ముగ్గురు బ్యాటర్లు డక్ అవుట్ అయ్యారు. ఇలా
బంగ్లాదేశ్.. 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత బౌలర్ల దెబ్బకు 11 పరుగుల వ్యవధిలోనే బంగ్లాదేశ్ చివరి 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో సౌమి పాండే.. 4 వికెట్లు పడగొట్టాడు. ముషీర్ ఖాన్ 2, రాజ్ లింబానీ 1, ఆర్షిన్ కులకర్ణి 1, ప్రియాన్షు మోలియా 1 వికెట్ తీశారు.
ఈ విజయంతో యువ భారత్ 2 పాయింట్లు సాధించి గ్రూప్ లో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మెరుగైన రన్ రేట్ తో ఐర్లాండ్ ఉంది. జనవరి 25న ఐర్లాండ్తో యువ భారత్ తలపడనుంది. ఈ మ్యాచులో గెలిస్తే.. టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది.
తర్వాత జనవరి 28న అమెరికాతో తలపడుతుంది. అలా గ్రూప్ దశలో టాప్-3లో ఉన్న జట్లు సూపర్ సిక్స్ కి, అంటే రెండో రౌండ్ కి వెళతాయి.