బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం దిశగా సాగిపోతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్ మన్ గిల్ (33), పంత్ (12) ఉన్నారు.
అంతకుముందు రెండోరోజు ఆట ప్రారంభించిన టీమ్ ఇండియా 376 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 149 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇండియాకి 227 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే వెంటనే బంగ్లాదేశ్ కి ఫాలో ఆన్ ఇవ్వకుండా టీమ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఈ క్రమంలో వేగంగా ఆడుతూ యశస్వి (10), రోహిత్ (5) చేసి అవుట్ అయ్యారు. అనంతరం గిల్ తో కలిసి కొహ్లీ స్కోరుని ముందుకు నడిపించాడు. అయితే తను క్రీజులో కుదురుకున్నట్టే కనిపించాడు. అనూహ్యంగా 17 పరుగుల వద్ద ఎల్బీగా వెనుతిరిగాడు. అయితే థర్డ్ అంపైర్ కి వెళ్లాల్సింది. శుభ్ మన్ గిల్ మాటలు నమ్మి వెనక్కి వెళ్లిపోయాడు. చివరికి అది బ్యాట్ కి టచ్ అయినట్టు రీప్లేలో కనిపించింది. ఇప్పుడది వ్యూహాత్మక తప్పిదంగా మారిపోయింది.
కొహ్లీ రివ్యూ అడిగి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. టోటల్ గా ఇండియా ఆధిక్యం 308 పరుగులుగా ఉంది. మూడో రోజు లంచ్ వరకు ఆడి డిక్లేర్ చేస్తారని అనుకుంటున్నారు. లేదంటే టీ బ్రేక్ వరకైనా ఆడి వదిలిపెడతారని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే టీమ్ ఇండియా పటిష్ట స్థితిలో ఉందనే చెప్పాలి.
మూడోరోజు ఫస్ట్ అవర్ లో వికెట్లు త్వరత్వరగా పడుతున్నాయి. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఆడితే, తర్వాత స్కోరు పరిగెడుతుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి మనవాళ్లు ఎలా ఆడతారో వేచి చూడాల్సిందేనని అంటున్నారు.
బంగ్లాదేశ్ బౌలింగులో తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, మెహిది హాసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో అదరగొట్టిన హసన్ మహమూద్ కి వికెట్లు దొరకలేదు.