India vs Australia 5th T20 : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టీ20 మ్యాచ్ .. అది ఆఖరి డెత్ ఓవర్ ఆస్ట్రేలియా గెలవాలంటే ఇంకా 10 పరుగులు మాత్రమే చేయాలి కిక్కిరిసిపోయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. అర్షదీప్ కి…కెప్టెన్ సూర్య బౌలింగ్ ఇచ్చాడు. అటువైపు కెప్టెన్ మాథ్యూ వేడ్ అంతకుముందు 18వ ఓవర్ లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపు మీదున్నాడు.
ఒకవైపు సిరీస్ పోయింది .. ఆఖరి మ్యాచ్ లో చావోరేవో తేల్చుకుందాం అన్నంత కసిగా ఉన్నాడు .. అలాంటి సమయంలో మూడు ఓవర్లలో 36 పరుగులిచ్చి, ఎక్స్ పెన్సివ్ బౌలర్ గా మారిన అర్షదీప్ చేతిలోకి బంతి వెళ్లేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
అయిపోయింది రా.. మ్యాచ్ అనుకున్నారు. సూర్య కెప్టెన్సీలో మాయాజాలమే అది… కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అర్షదీప్ నిలబెట్టుకున్నాడు. అప్పటికే ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో డెత్ ఓవర్స్ వేసిన అనుభవం తనకి ఉంది. అప్పుడు సీనియర్స్ చెప్పిన సలహాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. అంతవరకు వేసిన బౌలింగ్ ఒక ఎత్తు, ఇప్పుడు వేసేది.. ఒక ఎత్తు అన్నట్టు ఆడాడు. ఈ ఒక్క ఓవర్ తన క్రికెట్ భవితవ్యాన్ని నిర్ణయించేది అన్నట్టు ఆడాడు.
ఒకొక్క బాల్ ఒకొక్క నిప్పుకణికలా వెళ్లింది. దీంతో కెప్టెన్ వేడ్ ఒక షాట్ కొట్టి లాంగ్ఆన్ లో శ్రేయాస్ అయ్యర్ కి దొరికిపోయాడు. 19.3 ఓవర్ లో తను అవుట్ అయ్యాడు. మిగిలిన మూడు బాల్స్ లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. అలా 10 పరుగులు చేయాల్సిన దశలో ఆస్ట్రేలియా కేవలం 4 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 6 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఆఖరి మ్యాచ్ బెంగళూరులో జరిగింది. టాస్ గెలిచిన ఆసిస్ కెప్టెన్ వేడ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా మందకొడి పిచ్ పై 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అది కూడా శ్రేయాస్ అయ్యర్ పుణ్యమాని ఆ మాత్రం పరుగులైనా వచ్చాయి. తన ముందు అందరూ అవుట్ అవుతున్నా నిలకడగా ఆడి 2 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 37 బంతుల్లో 53 పరుగులు చేసి ఆఖరి ఓవర్ లో అవుట్ అయ్యాడు. అంతేకాకుండా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా చాలా రోజుల తర్వాత ఆల్ రౌండ్ షో చేశాడు. తన వంతుగా 21 బాల్స్ లో 31 పరుగులు చేశాడు. చివర్లో జితేశ్ శర్మ (24) ధనాధన్ ఆడాడు.
ఓపెనర్ జైస్వాల్ (21) పర్వాలేదనిపించాడు. కానీ రుతురాజ్ గైక్వాడ్ (10), కెప్టెన్ సూర్య కుమార్ (5), రింకూ సింగ్ (6) నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలింగ్ లో జాసన్ బెరెండార్ఫ్ 2, బెన్ డ్వార్షిస్ 2, ఎలిస్ 1, తన్వీర్ సంగా 1 వికెట్లు తీశారు. 161 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బీభత్సమైన ఆరంభం ఇచ్చింది. ఓపెనర్ హెడ్ (28) చాలా దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ జోష్ ఫిలిప్పీ (4) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. వీరిద్దరూ అవుటయ్యే సమయానికి ఆసిస్ 4.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగుల మీద పటిష్టస్థితిలో ఉంది.
ఆసిస్ బ్యాటర్లు ఎంత కసిగా ఆడారంటే, వారి ముఖాల్లోనే అది కనిపించింది. దానికి ఆవేష్ ఖాన్ బలైపోయాడు. 5 వ ఓవర్ లో మెక్ డెర్మాట్ ఒక బాల్ ని కొడితే అదెళ్లి స్గేడియం అవతల పడింది. దాంతో అంపైర్లు కొత్త బాల్ తీసుకున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అంత కసి వారి ముఖాల్లో కనిపించింది.
ఆ ఊపు చూస్తే… ఒక దశలో 15 ఓవర్లలోనే మ్యాచ్ అయిపోతుందని అనుకున్నారు. కానీ అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకుని కేవలం 14 పరుగులే ఇచ్చాడు. ఇది మ్యాచ్ కి హైలైట్ అని చెప్పాలి. తర్వాత సరైన సమయంలో ముకేష్ కుమార్ వరుసగా రెండు వికెట్లు తీసి ఆసిస్ నడ్డి విరిచాడు. అలా అనూహ్యంగా వికెట్లు పడుతూ వెళ్లాయి. మెక్ డెర్మాట్ అయితే అన్నీ సిక్స్ లే కొట్టాడు. మొత్తం 5 సిక్స్ ల సాయంతో 54 పరుగులు చేసి, అర్షదీప్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.
ఈ దశలో హార్డీ (6) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. తర్వాత టిమ్ డేవిడ్ (17), మాట్ షార్ట్ (16), కెప్టెన్ వేడ్ (22) ఇలా చేశారు గానీ, సరైన భాగస్వామ్యాలు రాలేదు. దాంతో విజయం ముంగిట ఆసిస్ బోర్లా పడింది. చివరికి 8 వికెట్ల నష్టానికి 154 పరుగుల వద్ద ఆసిస్ కథ ముగిసింది. టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్ ని 4-1 తేడాతో గెలిచి, ఘనంగా ముగించింది.
భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, రవి బిష్ణోయ్ 2, అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. 8 వికెట్లు తీసిన రవి బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకి ఎంపికయ్యాడు.