ICC Women’s T20 World Cup :మహిళల టీ20 వరల్డ్ కప్ లోకి భారత్ జట్టు సెమీస్ లో దూసుకెళ్లింది. టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన , షఫాలీ వర్మ జట్టుకు మంచి ఆరంభాన్ని అందిచారు. తొలి వికెట్ కు 62 పరుగులు జోడించిన తర్వాత షెఫాలీ వర్మ ( 24) పెవిలియన్ బాట పట్టింది. తర్వాత కెప్టెన్ హర్మన్ తో కలిసి స్మృతి రెండో వికెట్ కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. జట్టు స్కోర్ ను వంద పరుగులు ధాటించింది. అయితే హర్మన్ ప్రీత్ కౌర్ ( 20 బంతుల్లో 13 పరుగులు) నిదానంగా ఆడటంతో స్కోర్ వేగం పెరగలేదు.
హర్మన్ అవుట్ అయిన తర్వాత..గత మూడు మ్యాచ్ ల్లో అజేయంగా నిలిచి రెండు మ్యాచ్ ల్లో జట్టును గెలిపించిన రిచా ఝోష్ గోల్డెన్ డక్ అయ్యింది. ఈ సమయంలో స్మృతి చెలరేగి ఆడింది. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 87 పరుగులు సాధించింది. స్మృతి , దీప్తి శర్మ(డకౌట్) వెంట వెంటనే అవుటైనా..జెమీమా రోడ్రిగ్స్ ( 12 బంతుల్లో 19)మెరుపులు మెరిపించడంతో భారత్ జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి155 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో లౌర డిలానీ 3 వికెట్లు, ఓర్ల ప్రెన్ డెగ్రస్ట్ రెండు వికెట్లు, కెల్లీ ఒక వికెట్ తీశారు.
156 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కు తొలి బంతికి షాక్ తగిలింది. ఓపెనర్ హంటర్ రెండో పరుగు తీసే ప్రయత్నంలో రనౌట్ అయ్యింది. అదే ఓవర్ ఐదో బంతికి వన్ డౌన్ బ్యాటర్ ఓర్ల ప్రెన్ డెగ్రస్ట్ (డకౌట్ ) ను రేణుకా సింగ్ బౌల్డ్ చేసింది. దీంతో ఆ జట్టు తొలి ఓవర్ లోనే 1 పరుగుకే రెండు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత ఐర్లాండ్ బ్యాటర్లు పుంజుకున్నారు. గబీ లుయీస్ 25 బంతుల్లో 32 నాటౌట్, లౌర్ డిలానీ 17 నాటౌట్ మూడో వికెట్ కు 53 పరుగులు జోడించారు. ఆ జట్టు స్కోర్ 54/2 (8.2 ఓవర్ల)వద్ద వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన స్మృతి మంధానకు ఫ్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది
సెమీస్ బెర్తులు ఇలా..
గ్రూప్ -2లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించిన భారత్ రెండోస్థానంలో నిలిచి సెమీస్ చేరుకుంది. గ్రూప్ -1 లో టాప్ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ లో తలపడే అవకాశం ఉంది. గ్రూప్-2 లో ఇంగ్లాండ్ ఆడిన 3మ్యాచ్ ల్లో గెలిచి ఇప్పటికే సెమీస్ చేరింది. ఇంగ్లాండ్ తన చివరి మ్యాచ్ లో పాక్ తో తలపడుతుంది. గ్రూప్ -1 లో రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడుతున్నాయి. తన చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ ను ఓడిస్తే నేరుగా సెమీస్ చేరుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా ఓడితే న్యూజిలాండ్ సెమీస్ కు చేరుకుంటుంది. గ్రూప్ -1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టు గ్రూప్-2 టాప్ లో ఉన్న ఇంగ్లాండ్ తో తలపడే అవకాశం ఉంది.