Paris Olympics 2024 updates(Latest sports news telugu): పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత హాకీ టీమ్ కాంస్య పతకాన్ని సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్ పై 2-1 తేడాతో భారత్ జట్టు గెలిచింది. దీంతో వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి ఇండియా టీమ్ గెలిచేందుకు కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ ఒలింపిక్స్ లో మొత్తం ఇప్పటివరకు భారత్ కు నాలుగు కాంస్య పతకాలు వచ్చాయి.
తొలి క్వార్టర్స్ లో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభంలో (18వ నిమిషం) స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ స్ట్రోక్ ను గోల్ గా మార్చాడు. దీంతో ఆ జట్టు ఆధిక్యంలో కొనసాగింది. 29వ నిమిషంలో ఇండియాకు పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే, దీనిని హర్మన్ ప్రీత్ గోల్ గా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు.
Also Read: నిషేధంపై స్పందించిన అంతిమ్ పంఘాల్.. ఏమన్నారంటే?
ఆ వెంటనే మరో పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే, దీనిని ఇండియా సద్వినియోగం చేసుకుంది. ఈసారి హర్మన్ ప్రీత్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతి గోల్ పోస్ట్ లోకి పంపి స్కోర్ ను 1-1 తో సమం చేయసాగాడు. మూడో క్వార్టర్ మొదలైన కొద్దిసేపటికే పెనాల్టీ కార్నర్ తో హర్మన్ ప్రీత్ మరో గోల్ చేశాడు. ఆ తరువాత మూడు పెనాల్టీ కార్నర్ లు సాధించిన భారత్ వాటిని గోల్స్ గా మలచలేకపోయింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా స్పెయిన్ టీమ్ కు ఓ పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే, భారత్ దానిని సమర్థంగా అడ్డుకోగలిగింది.
ఇదిలా ఉంటే.. 2020 టోక్యో ఒలింపిక్స్ లోనూ ఇండియా టీమ్ కాంస్య పతకాన్ని గెలిచింది.