Under 19 World Cup : యువభారత్ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అండర్ 19 వన్డే ప్రపంచ కప్ 2024 లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో 201 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన యువ భారత్ ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీ తోడు కావడంతో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 పరుగులకు కుప్పకూలింది.
ముందుగా టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ (17), అర్షిన్ కులకర్ణి (32) పర్వాలేదనిపించారు. అయితే తొలి వికెట్ 32 పరుగుల వద్ద పడింది. దాంతో ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ కి దిగిన ముషీర్ ఖాన్ బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ చేశాడు. 4 సిక్స్ లు, 9 ఫోర్లు సాయంతో 106 బంతుల్లో 118 పరుగులు చేసి, జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం తెలుగు ఆటగాడు అరవెల్లి అవినాష్ రావు 3 ఫోర్లు కొట్టి, 13 బంతుల్లో 22 పరుగులు చకచకా చేశాడు. తర్వాత సచిన్ దాస్ మరో రింకూ సింగ్ ని తలపించాడు. కేవలం 9 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జట్టు స్కోరుని 300 దాటించాడు. మొత్తానికి 7 వికెట్ల నష్టానికి యువ భారత్ 301 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బౌలర్లలో ఓలివర్ రిలీ 3, జాన్ మెక్ నాల్లీ 2, ఫిలుట్టన్కు ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 పరుగులకు కుప్పకూలింది. నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఓపెనర్లు జోర్దాన్ నెయిల్ (11), ర్యాన్ హంటర్ (13), ఆలివర్ క్రిస్టోఫర్ (15) చేశారు. అయితే టెయిల్ ఎండర్ డానియెల్ ఫోర్కిన్ (27 నాటౌట్) చివర్లో ధాటిగా ఆడటంతో ఐర్లాండ్ ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది. ముగ్గురు బ్యాటర్లు డక్ అవుట్ అయ్యారు.
భారత బౌలర్లలో నమాన్ తివారీ 4, సౌమి పాండే 3, ధనుష్ గౌడ, మురుగణ్ అభిషేక్, ఉదయ్ శరణ్ తలో వికెట్ తీశారు. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 84 పరుగులతో మట్టికరిపించిన భారత్.. 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం అమెరికా జట్టుతో ఆడనుంది.