భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ హైదరబాద్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక ఆసక్తికరమైన విషయం తెలిపాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడని, స్పెషలిస్ట్ బ్యాటర్ గా వస్తాడని తెలిపాడు.
సుదీర్ఘమైన ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో అతనితో ప్రయోగాలు చేయలేమని తెలిపాడు. ఇటీవల టెస్ట్ మ్యాచ్ ల్లో రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడు, సౌతాఫ్రికాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అతను చేసిన సెంచరీ అత్యున్నతమైనదని తెలిపాడు.
అంతసేపు క్రీజులో ఉండి పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు, మళ్లీ రోజంతా వికెట్ కీపింగ్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. అంత భారం రాహుల్ పై వేయలేమని అన్నాడు. ఆ ఉద్దేశంతోనే ఇద్దరు కీపర్లు కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్ ఇద్దరినీ తీసుకున్నట్టు ద్రవిడ్ చెబుతున్నాడు.
ఈ మాటలను బట్టి చూస్తే తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కు కీపర్ గా అవకాశం వస్తుందని అంటున్నారు. తనేమైనా విఫలమైతే అప్పుడు ధ్రువ్ జురెల్ కి ఇవ్వవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలోనే అత్యుత్తమ టెస్టు ఫార్మాట్ వికెట్ కీపర్ గా ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ కు పేరుంది. అయితే బ్యాటింగ్ లో విఫలం కావడంతో అతను అవకాశాలను అందిపుచ్చుకోలేక సతమతం అవుతున్నాడు. ఒకప్పుటి రోజుల్లో కీపర్ అంటే కీపింగ్ మాత్రమే చేసేవాడు. కానీ ధోనీ వచ్చాక నయా ట్రెండ్ మొదలైంది. కీపర్ అంటే బ్యాటర్ కూడా అయి ఉండాలనే సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.
దీంతో కీపర్ గా రాణిస్తున్నప్పటికి బ్యాటర్ గా విఫలమైతే మాత్రం జాతీయ జట్టులో అవకాశాలు రావడం లేదు. అయితే కేఎస్ భరత్ గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ కి ఎంపికయ్యాడు. అన్ని మ్యాచ్ ల్లో ఆడాడు. కీపింగ్ అద్బుతంగా చేశాడు. కానీ బ్యాటింగ్ లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు.
ఈ ఒక్క కారణంతో భరత్ ను పక్కనపెట్టి యువ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ వైపు సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. ఇప్పుడు కిషన్ తో పాటు పలువురు పోటీలో ఉన్నారు.