Cricketers In APSRTC : విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్.. ఒక సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. అదేమిటంటే రెండు జట్ల ప్లేయర్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం నెట్టింట హల్చల్ చేస్తోంది.
రెండో టెస్ట్ కోసం వచ్చిన క్రికెటర్లు బస చేసిన హోటళ్ల నుంచి గ్రౌండ్ వరకు, మళ్లీ ఆట ముగిసిన తర్వాత గ్రౌండ్ నుంచి హోటల్ కి ఇవే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ తన అధికారిక వెబ్ సైట్ లో ఫొటోలు పెట్టడంతో నెట్టింట ఇదే చర్చ మొదలైంది.
ఏపీఎస్ ఆర్టీసీకి ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి, అంతేకాదు ఆర్టీసీలో కూడా లగ్జరీ బస్సులు ఉన్నాయని ప్రజలకు తెలియజేయడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నామని ఆర్టీసీకి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు.
క్రికెటర్లే ప్రయాణించగా లేనిది, తామెందుకు చేయకూడదని ప్రజలు అనుకుంటారని, అలాగే తమ అభిమాన క్రికెటర్లు ఏం చేస్తే, ప్రజలు అదే ఫాలో అవుతారు కాబట్టి, ఇది తమకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు.
సాధారణంగా అంతర్జాతీయ క్రికెటర్లు హోటల్ నుంచి స్టేడియానికి వెళ్లేందుకు ప్రైవేటు వోల్వో బస్సులను ఉపయోగిస్తారు. కానీ ఏపీఎస్ ఆర్టీసీ విన్నపాన్ని క్రీడాధికారులు మన్నించడంతో ఈ అవకాశం దక్కింది. ఇప్పుడు భారతదేశంలోని రాష్ట్రాల్లో జరిగే ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో కూడా ఆ దేశపు ఆర్టీసీ బస్సులనే ఉపయోగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ అవకాశం కల్పించినందుకు బీసీసీఐతో పాటు ఇంగ్లండ్ బోర్డుకి ఏపీఎస్ఆర్టీసీ ధన్యవాదాలు తెలిపింది. ఆర్టీసీకి చెందిన డాల్ఫిన్ క్రూజర్ బస్సుల్లో ఇరు దేశాల ఆటగాళ్లు ప్రయాణం చేశారు. ఒకొక్క జట్టుకి రెండేసి బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఏపీఎస్ఆర్టీసీని నెటిజన్లు అభినందిస్తున్నారు. సంస్థను మరింత అభివృద్ధి వైపు నడిపించాలని కోరుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణాన్ని తగ్గించి, సురక్షితంగా తీసుకువెళ్లే ఆర్టీసీకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని అంటున్నారు.
అంతేకాదు తమ వంతుగా కూడా ఆర్టీసీలో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తామని అంటున్నారు. మరికొందరు మాత్రం మన క్రికెటర్లు అందరూ టిక్కెట్లు తీసుకున్నారా? లేదా? అని సరదాగా సెటైర్లు పేల్చుతున్నారు.