IND vs AUS: ఆట అద్భుతాలు చేస్తుంది. మైదానంలోనైనా. బయటైనా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. క్రికెట్లో టగ్ ఆఫ్ వార్ టీమ్లు. స్లెడ్జింగ్లో టాప్లో ఉండే ఆసీస్తో మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్కంఠే. ఇదంతా ఆట వరకే పరిమితం. బయట ఇరుజట్ల ఆటగాళ్ల స్నేహం. ప్లేయర్సే కాదు.. ప్రధానులను సైతం ఒక్కచోటకు చేర్చింది క్రికెట్. అహ్మదాబాద్లో జరుగుతున్న భారత్-ఆసీస్ నాలుగో టెస్టు మ్యాచ్కి.. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ ఆల్బనీస్ విచ్చేసి.. ఆటకు మించి అనిపించారు. గుజరాత్లోని నరేంద్రమోదీ స్టేడియం ఇందుకు వేదికగా నిలిచింది.
75 ఏళ్ల ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా.. మోదీ, ఆంటోనీ ఆల్బనీస్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రధాని మోదీ.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు ఆ దేశ ప్రధాని ఆల్బనీస్ టెస్టు క్యాప్లు అందించారు.
ఇరు దేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో మైదానమంతా కలియదిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఆటగాళ్లతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు.
మ్యాచ్ చూసేందుకు వచ్చిన మోదీ, ఆల్బనీస్లను BCCI ఘనంగా సత్కరించింది. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ తరఫున అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. ఆసీస్ ప్రధానికి ప్రత్యేక మెమొంటోను అందజేశారు. బీసీసీఐ కార్యదర్శి జై షా.. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేశారు.
బోర్డర్-గావస్కర్ సిరీస్లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది టీమిండియా. నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోంది ఆసీస్.