Sai Sudharsan : సౌతాఫ్రికా పర్యటనలో టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా అంతర్జాతీయ వన్డేలతో ఎంట్రీ ఇచ్చిన తమిళనాడుకి చెందని భరద్వాజ్ సాయి సుదర్శన్ 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేశాడు. రెండో వన్డేలో ఓపెనర్ గా వచ్చిన తను 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తనతో పాటు కేఎల్ రాహుల్ 56 పరుగులు చేశాడు. వీళ్లిద్దరే రాణించారు. మిగిలిన వాళ్లందరూ ఇలా వచ్చి అలా వెళ్లారు.
ఇప్పుడు సాయి సుదర్శన్ చేసిన 62 పరుగులే జట్టు చేసిన 211 స్కోర్ లో కీలకంగా మారాయి. తొలి వన్డేలో కూడా 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో కెరీర్ లో ఆడిన తొలి రెండు వన్డేల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచి రికార్డ్ సృష్టించాడు. పిచ్ బౌలింగ్ను అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లోనూ 62 పరుగులు చేయడం గొప్ప విషయంగా చెప్పాలి. 83 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ఈ పరుగులు సాధించాడు.
ఈ రికార్డ్ మొదట నవజోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉంది. వన్డేల్లో 1987లో అరంగేట్రం చేసిన సిద్ధూ.. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్తో సిరీస్లో భాగంగా తొలి మ్యాచులో 73, రెండో మ్యాచులో 75 పరుగులు చేశాడు. 36 ఏళ్ల తర్వాత ఈ రికార్డును 22 ఏళ్ల సాయి సుదర్శన్ సాధించాడు.
ఒకవైపు నుంచి టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలోనూ యువ జట్లతో కళకళలాడుతోంది. అందరూ ఆరంగ్రేటం మ్యాచ్ లతో అదరగొడుతున్నారు. తమ మీద నమ్మకాలను పెంచుతున్నారు. కాకపోతే నిలకడలేమి మేనేజ్మెంట్ ను ఇబ్బందిపెడుతోంది. ఒకరెండు మ్యాచ్ లు ఆడటం, రెండు విఫలం కావడం ఇలా వచ్చి వెళుతున్నారు. టీ 20లో ఇరగదీసిన యువకులు, వన్డేల్లో తేలిపోతున్నారు.
వీళ్లు ధనాధన్ ఆటకే పరిమితమయ్యారా? అంటే అవుననే చెప్పాలి. తొలి వన్డేలో రెండు వికెట్లు నష్టపోయి టీమ్ ఇండియా విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ రెండు వన్డేల్లో నిరాశపరిచాడు. తిలక్ వర్మకు మొదటి వన్డేలో 1 పరుగు మాత్రమే చేసి నాటౌట్ గా ఉన్నాడు. రెండో వన్డేలో 10 పరుగులు మాత్రమే చేశాడు. సంజూ శాంసన్ (12) వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్టుగానే కనిపిస్తోంది. రింకూ సింగ్ (17) మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
మరి రేపు 2024లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ నకు ఎవరు చివరి జట్టులో ఉంటారు? ఎవరు బయట ఉంటారనేది కాలం చెప్పాల్సిన సమాధానమే. ఎందుకంటే సీనియర్లు కొహ్లీ, రోహిత్ వస్తే, ఇద్దరు యువకులు త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే కూర్పు మాత్రం అంత ఈజీ కాదనే చెప్పాలి.