IND vs SA 2nd Test : సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ లో ఘోరంగా ఓటమి పాలైన జట్టు నుంచి ఇద్దరు బౌలర్లను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రెండో టెస్ట్ కి కూడా మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడంతో తన ప్లేస్ లో ఆవేశ్ ఖాన్ ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. దీంతో అతను రెండో టెస్ట్ లో ఆడనున్నాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో తను వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరోవైపు మొదటి టెస్ట్ లో ప్రభావం చూపలేకపోయిన శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో ముఖేష్ కుమార్ ను ఆడించేందుకు టీమ్ ఇండియా ఆలోచనలు చేస్తోంది. ఎందుకంటే ఆల్ రౌండర్ గా తను పెద్దగా ఆకట్టుకోలేక పోవడం సమస్యగా మారింది. అయితే టీమ్ ఇండియాలో ఆల్ రౌండర్ల కొరత ఎక్కువగా ఉంది. రవీంద్ర జడేజా ఉన్నప్పటికి తనిప్పుడు పెద్దగా ప్రభావం చూపించడం లేదు. కాకపోతే శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో తనని ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిని నిజం చేసేలా రవీంద్ర జడేజా క్రికెట్ గ్రౌండ్ లో సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
నిజానికి జట్టులో హార్దిక్ పాండ్యా గాయాల పాలు కావడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేవారే కరవయ్యారు. ఒకవైపు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉన్నా, వారు స్పిన్ బౌలింగ్ చేస్తారు. సౌతాఫ్రికా పిచ్ లన్నీ ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలంగా ఉంటాయి. వీటిపై వీరు తేలిపోతారు. అందుకే మీడియం పేస్ వేసే శార్దూల్ ఠాకూర్ కి అవకాశం ఇచ్చారు. కానీ అతను అంత ప్రభావం చూపించలేకపోతున్నాడు. అయినా సరే, టీమ్ ఇండియా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఒక ఆల్ రౌండర్ ని తయారు చేయాలి. ఆ అవసరమైతే ఉంది.
ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఎప్పుడెలా ఉంటాడో తెలీదు. ధోనీ వెళ్లిన తర్వాత హార్దిక్ దొరికాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు హార్దిక్ లేకపోతే ఎవరో ఒకరుండాలి కదా…అదీ కాకుండా రవీంద్ర జడేజా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఈ కారణం రీత్యా కూడా శార్దూల్ ఠాకూర్ కి వరుసగా అవకాశాలిస్తున్నారు. కానీ అది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
శార్దూల్ కి కూడా అంతర్జాతీయ అనుభవం రావాలి, ఒత్తిడిలో ఆడటం రావాలి. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను ఎలా అవుట్ చేయాలో తెలియాలి. ఇవన్నీ కావాలంటే తను క్రికెట్ ఆడేందుకు ఎంత కష్టపడ్డాడో, ఇప్పుడు జట్టులో స్థానం కోసం అంతకన్నా ఎక్కువ కష్టపడాలని సీనియర్లు చెబుతున్నారు.