IND vs SA 1st Test : సౌతాఫ్రికాతో జరిగిన తొలిటెస్ట్ లో టీమ్ ఇండియాపై ఐసీసీ కన్నెర్ర చేసింది. అనుకున్న సమయానికన్నా రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో స్లో రన్ రేట్ కారణంగా పెనాల్టీ విధించింది. మ్యాచ్ రిఫరీ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఐసీసీ నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అంతేకాదు రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పెట్టింది.
ఇప్పటికే ఒక ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమి దెబ్బకి ఐదో స్థానానికి పడిపోయిన టీమ్ ఇండియా… ఐసీసీ నిబంధనలతో మరో పాయింట్ దిగువకు పడిపోయింది. ప్రస్తుతం టీమ్ ఇండియా ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఓటమితో డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్ర స్థానం నుంచి ఆరోస్థానానికి పడిపోయింది.
ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో బౌలింగ్ వేయలేకపోతే ఒక ఓవర్ కు 5 శాతం చొప్పున ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఇక్కడ రెండు ఓవర్లు ఆలస్యం కావడంతో 10 శాతం పోయింది.
అలాగే ఆర్టికల్ 16.11లోని డబ్ల్యూటీసీ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం ఒక ఓవర్ ఇన్ టైమ్ లో వేయకపోతే ఒక పాయింట్ కట్ చేస్తారు. ఇక్కడ రెండు ఓవర్లకి రెండు పాయింట్లు కట్ చేసి పారేశారు. దీంతో టెస్ట్ మ్యాచ్ లు ఆడే 8 జట్లలో ఆరో స్థానంలో టీమ్ ఇండియా నిలిచింది. ఏడో స్థానంలో ఇంగ్లాండ్ ఉంది.
ఇప్పుడు జనవరి 25 నుంచి ఈ రెండు జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఇప్పుడందరూ అనేమాట ఏమిటంటే..‘సరిపోయారు ఇద్దరికిద్దరూ ’అని అంటున్నారు.
ఈ పెనాల్టీలు విధించే ముందు కెప్టెన్ రోహిత్ శర్మను మ్యాచ్ రిఫరీ వివరణ కోరాడు. అయితే తను ఎందుకొచ్చిన గొడవ, మళ్లీ లాక్కోలేక పీక్కోలేక చావాల్సి వస్తుందని వెంటనే పొరపాటును అంగీకరించాడు. దీంతో తదుపరి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. కథని ఇక్కడితో ముగించాడు.
ఈ దెబ్బకి 2023-25 పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానం నుంచి ఆరో స్థానానికి టీమ్ ఇండియా ఒక్కసారి బోల్తా కొట్టింది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 5-0తో అన్నీ గెలిస్తే, అప్పుడు టాప్ 2 కి వెళ్లే అవకాశాలున్నాయి. ఇదే రీతిలో ఇంగ్లాండ్ కూడా ఆలోచిస్తోంది. ఎందుకంటే మనకన్నా దారుణంగా వారి పరిస్థితి ఉంది. దొందూ దొందే ఏం చేస్తాయో రెండు జట్లని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.