IND vs ENG First Test : హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ తడబడింది. బజ్ బాల్ మంత్రం పని చేయలేదు. భారత్ స్పిన్ వలకు ఆ జట్టు బ్యాటర్లు చిక్కారు. తొలి రోజే ఇంగ్లాండ్ జట్టు.. 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ దూకుడుగానే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఓపెనర్ బెన్ డక్కెట్ ఎదురుదాడికి దిగాడు. వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వికెట్కు 55 పరుగులు జోడించిన తర్వాత డక్కెట్ (35) ను వికెట్ల ముందు అశ్విన్ దొరకబుచ్చుకున్నాడు. ఈ సమయంలో 5 పరుగుల తేడాలో ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఓలీ పోప్ (1)ను జడేజా అవుట్ చేయగా.. మరో ఓపెనర్ జాక్ క్రాలీ (20)ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. ఇలా వెంటవెంటనే ముగ్గురు బ్యాటర్లు అవుట్ కావడంతో ఇంగ్లాండ్ 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది.
జో రూట్ (29), జానీ బెయిర్ స్టో (37) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. నాలుగో వికెట్ 61 పరుగులు జోడించిన తర్వాత బెయిర్ స్టోను అక్షర్ పటేల్ బౌల్డ్ చేసి బ్రేక్ త్రూ అందించాడు. మరో నాలుగు పరుగుల తర్వాత రూట్ ను జడేజా పెవిలియన్ కు చేర్చాడు. మరో 12 పరుగుల తర్వాత కీపర్ బెన్ ఫోక్స్ (4)ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు.
మరో ఎండ్లో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్లతో కలిసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు. జట్టు స్కోర్ ను 200 దాటించాడు. స్టోక్స్ కు రేహన్ అహ్మద్ (13), టామ్ హార్ట్లీ (23) సహకారం అందించారు. రేహన్ ను బుమ్రా అవుట్ చేయగా.. హార్ట్లీని జడేజా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మార్క వుడ్ (11)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. దూకుడిగా ఆడిన స్టోక్స్ (70) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా, అశ్విన్కు తలో 3 , అక్షర్ పటేల్, బుమ్రాకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆటముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (24) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. తొలిరోజు ఆటముగిసే సరికి యశస్వి జైస్వాల్ (76 బ్యాటింగ్), శుభ్ మన్ గిల్ ( 14 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నారు.