IND vs ENG First Test : హైదరాబాద్ లో జరుగుతున్న తొలిటెస్ట్ లో తొలిరోజు టీమ్ ఇండియాదే పై చేయిగా నిలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. హైదరాబాద్ పిచ్ రెండు, మూడు రోజుల తర్వాత స్పిన్ తిరుగుతుందని భావించినట్టున్నారు. కానీ తొలిరోజు నుంచే స్పిన్ తిరిగింది. అక్షర్ పటేల్ 2, అశ్విన్ 3, జడేజా 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచారు.
మొత్తానికి మొదటిరోజు ఇంగ్లాండ్ 64.3 ఓవర్లు ఆడి 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (24) వికెట్ కోల్పోయి, ఆట ముగిసే సమయానికి 119 పరుగులతో నిలిచింది.
బజ్ బాల్ వ్యూహం అంటూ గొప్పలు పోయిన ఇంగ్లాండ్ జట్టుకి, యశస్వి జైస్వాల్ రివర్స్ లో రుచి చూపించాడు. ఇన్నాళ్లూ అందరికీ వాళ్లు చూపించారు. ఇప్పుడు వారికి తను చూపించాడు. 3 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 70 బాల్స్ లో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ముఖ్యంగా స్పిన్నర్ టామ్ హార్ట్ లీకి చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్ లో రెండు సిక్స్ లు కొట్టి చెమటలు పట్టించాడు. ఒకరకంగా చెప్పాలంటే తన బౌలింగ్ నే టార్గెట్ చేసి ఒక ఆట ఆడుకున్నాడు. దీంతో టామ్ 9 ఓవర్లు వేసి 63 పరుగులు సమర్పించుకున్నాడు.
మిగిలిన బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేశారు. జాక్ లీచ్ కి రోహిత్ శర్మ దొరికిపోయాడు. భారీ సిక్సర్ కొట్టాడు కానీ, అది గ్రౌండ్ లోనే ఉండటంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ సులువైన క్యాచ్ అందుకున్నాడు. తర్వాత వచ్చిన గిల్ చాలా జాగ్రత్తగా ఆడాడు. 43 బాల్స్ ఆడి 14 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఒక పరుగు దగ్గర ఎల్బీడబ్ల్యూకి ఇంగ్లాండ్ అప్పీలు చేసింది. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో ఇంగ్లాండ్ డీఆర్ఎస్ కి వెళ్లింది. అయితే తృటిలో గిల్ తప్పించుకున్నాడు. ఇక అక్కడ నుంచి జాగ్రత్తపడ్డాడు. మొత్తానికి మొదటిరోజు ముగిసేసరికి టీమ్ ఇండియా ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. అన్నీ కుదిరితే రేపు ఉదయం యశస్వి జైస్వాల్ సెంచరీ చేస్తాడని అందరూ భావిస్తున్నారు.
తొలిరోజు టీమిండియా స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సిరీస్ ప్రారంభానికి ముందు స్పిన్ పిచ్లపై కూడా బజ్బాల్ ఆడతామని ప్రకటించిన ఇంగ్లాండ్ వెనుకడుగు వేసింది. అయితే బజ్బాల్ బ్యాటింగ్ విధానం ప్రారంభించిన తర్వాత ఇంగ్లాండ్ నెలకొల్పిన అతితక్కువ రన్నేటు ఇన్నింగ్స్ ఇదే కావడం గమనార్హం.
ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (20), డకెట్ (35) తొలి వికెట్ కి 55 పరుగులు జోడించారు. దీంతో స్పిన్నర్లను రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. అశ్విన్, జడేజా స్వల్ప వ్యవధుల్లోనే వికెట్లు తీసి భారత్ కి బ్రేక్ అందించారు. తర్వాత బెయిర్ స్టో (37), రూట్ (29) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఒక దశలో ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 120 స్కోరుతో నిలిచింది. బెయిర్ స్టో, రూట్, వికెట్ కీపర్ ఫోక్స్ స్వల్ప వ్వవధిలోనే పెవిలియన్ బాట పట్టారు.
ఒకవైపు నుంచి స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ కుప్పకూలుతున్నా కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేశాడు. బజ్ బాల్ ఆటని టీమ్ ఇండియాకి రుచి చూపించాడు. 3 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 88 బంతుల్లో 70 పరుగులు చేశాడు. చివరికి బూమ్రా చేతిలో బౌల్డ్ అయ్యాడు. చివరికి 246 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ కథ ముగిసింది.
బుమ్రా 2, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ కి వికెట్లు దక్కలేదు.