IND vs ENG Fifth Test Day 2 Updates: ఇంగ్లాండ్ తో ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమ్ ఇండియా భారీ స్కోరు చేసి మ్యాచ్ పై పట్టు బిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందుకు బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. ఉదయం ఒక వికెట్ నష్టానికి 135 పరుగులతో ప్రారంభించిన టీమ్ ఇండియాకు అద్భుతమైన ఆరంభం దొరికింది.
కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఇద్దరూ సూపర్ సెంచరీలు సాధించారు. దీంతో టీమ్ ఇండియా పటిష్టమైన స్థితికి వెళ్లింది. ముఖ్యంగా రోహిత్ శర్మ టెస్టుల్లో 12వ సెంచరీ నమోదు చేశాడు. 162 బంతులాడి 103 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఓవరాల్ ఇది తనకి 48వ సెంచరీ అని చెప్పాలి.
తర్వాత శుభ్ మన్ గిల్ కూడా మళ్లీ తన పూర్వపు ఫామ్ అందుకున్నాడు. అలవోకగా బ్యాటింగ్ చేశాడు. 150 బంతులాడి 110 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. గిల్ టెస్టుల్లో 4వ సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్ గా 11 సెంచరీలు చేశాడు.
104 పరుగులు వద్ద యశస్వి జైశ్వాల్ (57) తొలి రోజు అవుట్ అయ్యాడు. మళ్లీ రెండోరోజు 279 పరుగుల వద్ద గిల్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఆరంగేట్రం ఆటగాడు దేవదత్ పడిక్కల్ ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్ లోనే చాలా సాధికారికంగా ఆడాడు. తను కూడా సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ 103 బంతుల్లో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 10 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి.
చిచ్చరపిడుగు సర్ఫరాజ్ మళ్లీ ఈమ్యాచ్ లో కూడా ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. అయితే సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆఫ్ సెంచరీ తో సరిపెట్టేశాడు. 60 బంతులు ఎదుర్కొని 56 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, 1 సిక్సు ఉంది. అయితే దేవదత్ 403 పరుగుల వద్ద 5 వ వికెట్ గా వెనుతిరిగాడు.
Read More: అరేయ్ బాబూ.. అది 152 కిమీ స్పీడ్ తో వస్తోంది.. రోహిత్ సిక్సర్ కి నెటిజన్ల ఫిదా
తర్వాత ధ్రువ్ జురెల్ (15) చేసి అవుట్ అయ్యాడు. అయితే అనూహ్యంగా అశ్విన్ డక్ అవుట్ అయ్యాడు. తర్వాత మరో వికెట్ పడకుండా కులదీప్ (27 ), బుమ్రా (19 ) మ్యాచ్ చివరి వరకు నిలిచారు. మొత్తానికి అందరూ కలిసికట్టుగా ఆడి భారత్ ని పటిష్ట స్థితికి తీసుకువెళ్లారు.
ఒక ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ వరుసగా ఐదుగురు ఆఫ్ సెంచరీలు సాధించడం ఇది నాలుగోసారిగా రికార్డులకెక్కింది.
ఇంగ్లాండ్ బౌలింగ్ లో షోయబ్ బషీర్ 4, టామ్ హార్ట్ లీ 2, అండర్సన్ 1, బెన్ స్టోక్స్ 1 వికెట్ పడగొట్టారు.
మూడో రోజు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి ఇంగ్లాండ్ కి బ్యాటింగ్ ఇచ్చి ఇన్నింగ్స్ విజయం సాధించాలని టీమ్ ఇండియా వ్యూహాలు పన్నుతోంది.