Dhruv Jurel IND Vs ENG 3rd Test : ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కొత్తవారికి తలుపులు తెరిచింది. సీనియర్ల గైర్హాజరీతో ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ముగ్గురూ ఈ సిరీస్ లోనే ఆరంగ్రేటం చేశారు.
రజత్ పటీదార్ వచ్చిన అవకాశాలను వృధా చేసుకుంటున్నాడు. రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లో 32, 9 పరుగులు చేస్తే మూడో టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో ప్రూవ్ చేసుకోకపోతే బహుశా నాలుగో టెస్ట్ లో గానీ కేఎల్ రాహుల్ వస్తే, తనపైనే వేటు పడేలా ఉంది.
23 ఏళ్ల ధృవ్ చంద్ జురెల్ విషయానికి వస్తే, త్వరగానే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే రిషబ్ పంత్ కి ప్రమాదం జరగడంతోనే ఇషాన్ కిషన్ వెలుగులోకి వచ్చాడు. కేఎస్ భరత్, ధృవ్, జితేష్ శర్మ పేర్లన్నీ తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఇషాన్ కిషన్ మానసికంగా ఇబ్బంది పడుతూ జట్టుకి దూరమయ్యాడు. కేఎస్ భరత్ బ్యాటింగ్ చేయలేక సతమతం అవుతున్నాడు. జితేష్ శర్మ టీ 20లకే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో మరి ధృవ్ ఎలా ఆడతాడని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Read more : రోహిత్ హాఫ్ సెంచరీ.. ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటం..
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ కొలువైన ఆగ్రా నుంచి ధృవ్ జురెల్ వచ్చాడు. దేశవాళీ క్రికెట్ లో ఉత్తర్ ప్రదేశ్ తరఫున, ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఇంట్లో పేదరికం ఉన్నాసరే, కష్టపడి క్రికెటర్ అయ్యాడు.
తల్లి తన మెడలోని చిన్న బంగారు నగ అమ్మి ధృవ్ కి క్రికెట్ కిట్ కొనిచ్చారు. ఇలా చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడిన ధృవ్ జాతీయ జట్టుకి ఎంపిక కావడం, అందునా ఇంత త్వరగా 11 మంది ఫైనల్ స్క్వాడ్ లోకి రావడం అద్రష్టంగా భావిస్తున్నాడు.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగే కనిపిస్తున్నాడు. అలాగే టీమ్ ఇండియాలో ఖాళీగా ఉన్న వికెట్ కీపింగ్ ప్లేస్ ని భర్తీ చేసి, దేశం గర్వించతగిన ఒక మహేంద్ర సింగ్ ధోనీలా ఎదగాలని ఆశిద్దాం.